కలెక్టర్ కారును ఢీకొట్టిన లారీ: తృటిలో బయటపడ్డ అనితా రామచంద్రన్
భునగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రదకు పెను ప్రమాదం తప్పింది. భువనగిరి మండలం అనాజీపురం వద్ద ఓ కారుతోపాటు కలెక్టర్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో కలెక్టర్ సహా సిబ్బంది ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
కలెక్టర్ ప్రయాణించిన వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో జరిగిన నష్టాన్ని కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించి భువనగిరి క్యాంపు కార్యాలయానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన అనంతరం అదనపు కలెక్టర్ కారులో కలెక్టర్ తన కార్యాలయానికి చేరుకున్నారు.

విశ్రాంత ఐఏఎస్ కుమారుడి మృతదేహం లభ్యం
మూడు రోజుల కిందట ఈతకు వెళ్లి గల్లంతైన విశ్రాంత ఐఏఎస్ కుమారుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉంటుండగా, చిన్నకుమారుడు శ్రవణ్ కుమార్(34) తండ్రితోపాటు ఉండేవారు. అక్టోబర్ 11న నల్గొండ నుంచి హాలియాకు చేరుకున్న శ్రవణ్.. 14వ మైలురాయి నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద నీటిలోకి ఈత కొట్టేందుకు దిగాడు.
అయితే, నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి చెరువులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మృతదేహం శ్రవణ్ కుమార్దేనని పోలీసులు గుర్తించారు. శ్రవణ్ కుమార్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుదవారం సాయంత్రం శ్రవణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications