అన్ని గాలికొదిలేశారు: కెసిఆర్, చంద్రబాబుపై డిగ్గీ ఫైర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాలికొదిలేశారని చంద్రబాబునాయుడు, కె చంద్రశేఖర్ రావులపై విరుచుకుపడ్డారు.
వైయస్ 67వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవిభాజ్య రాష్ట్రానికి వైయస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రస్తుతం రైతు వ్యతిరేకులైపోయారని నిప్పులు చెరిగారు.
అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్లు స్వప్రయోజనాల కోసమే చూస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలపై వీరు చూపిస్తున్న ప్రేమలో ఇసుమంతైనా ప్రజా సంక్షేమంపై చూపడం లేదని ధ్వజమెత్తారు.
వైయస్ జయంతి వేడుకల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.