'ప్రాణ త్యాగానికైనా సిద్దం' : గద్వాల జిల్లా కోసం డీకే అరుణ పాదయాత్ర
గద్వాల్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆయా కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమానికి తెరలేపింది. ఈ క్రమంలోనే జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటు బలంగా తెరపైకి వస్తోంది. ముఖ్యంగా గద్వాల జిల్లా ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే డీకే అరుణ గట్టిగా పట్టుబడుతున్నారు.
ఇదే నేపథ్యంలో తాజాగా గద్వాల జిల్లా ఏర్పాటే ధ్యేయంగా.. డీకే అరుణ పాదయాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. గద్వాల పరిధిలోని జమ్మిచేడు గ్రామ జములమ్మ ఆలయం నుంచి మంగళవారం నాడు డీకే అరుణ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ.. గద్వాల జిల్లా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని ప్రకటించారు.
స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్, వనపర్తిని జిల్లా చేస్తున్నారని ఆరోపించిన డీకే అరుణ.. అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, గద్వాల, ఇటిక్యాల, మానవపాడు, ఆలంపూర్ తదితర ప్రాంతాల మీదుగా 30 గ్రామాల్లో దాదాపు 60 కిలోమీటర్ల మేర ఈ నెల 22 వరకు ఈ పాదయాత్ర సాగనుంది.
పాదయాత్రలో ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్యెల్యే సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. జోగులాంబ జిల్లా పేరుతో గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని అక్కడి ప్రజలు ఏడాది కాలంగా కోరుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇందుకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని మండిపడ్డారు.