శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర వెనుక ప్రశాంత్ కిషోర్: కేసీఆర్ పైనా డీకే అరుణ సంచలనం
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను చేధించినట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు.
Recommended Video
ఇది పీకే సలహాతో సీఎం కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల కుట్ర
ఈ కేసుల వెనక పీకే సలహా ఉందని, సీఎం కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల కుట్ర ఇదని డీకే అరుణ ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యకు కుట్ర అనేది పచ్చి అబద్ధం అని ఆమె తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తన ఇంటిపై జరిగిన రాళ్ల దాడి పై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పై రాళ్లు వేయడం ఎలాంటి రాజకీయమని ప్రశ్నించిన డీకే అరుణ దమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్లాడాలని సవాల్ విసిరారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం లేదని డీకే అరుణ పేర్కొన్నారు.
సీబీ ఐ తోపాటు దర్యాప్తు సంస్థల విచారణ కోరతాం
ఈ కేసుపై సిబిఐ తో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని తాము కోరతామని డీకే అరుణ వెల్లడించారు. పులి లాగా ఉండే స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులు ప్రస్తుతం పిల్లి లాగా మారుతున్నారు అంటూ డీకే అరుణ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని డీకే అరుణ ఆరోపించారు.
ఇదొక రాజకీయ కుట్ర
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాటం చేస్తే ఎవరికైనా తాము షెల్టర్ ఇస్తామని డీకే అరుణ స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కొందరు వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారని పేర్కొన్న డీకే అరుణ ఈ విషయాన్ని మంత్రి తట్టుకోలేకపోయాడు అంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో మంత్రి కబ్జాలపై, అవినీతిపై పోరాటం చేస్తున్న యువకులను టార్గెట్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిపై కక్ష పెంచుకున్నారు అని డీకే అరుణ ఆరోపణలు గుప్పించారు. ఇదొక రాజకీయ కుట్ర అని ఆమె మండిపడ్డారు.
బీజేపీపై బెంగాల్ తరహా దాడులకు పీకే ప్లాన్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుభూతి కోసమే హత్య కుట్ర పేరుతో డ్రామాలకు తెర తీశారని డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ తరహాలో లూటీ చేస్తామంటే కుదరదని డీకే అరుణ పేర్కొన్నారు. బెంగాల్ తరహా దాడులు బీజేపీ నాయకుల పై చేయాలని పీకే కేసీఆర్ కు సూచించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే పీకే చెప్పినట్లు వింటున్నాడని ఆరోపించారు.
శ్రీనివాస్ గౌడ్ ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు... విచారణకు మేం రెడీ
డీకే అరుణ బీహార్ తరహాలో ఇక్కడ లూటీ చేస్తామంటే పీకే ని తెలంగాణ ప్రజలు పీకి పంపిస్తారు అంటూ పేర్కొన్నారు. ఒక మహిళ మీద ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న డీకే అరుణ మహిళా సమాజం కేసీఆర్ ని క్షమించదని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించిన డీకే అరుణ శ్రీనివాస్ గౌడ్ ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.