కేసీఆర్ ఝూటాకోర్ ; జగన్ తో కుమ్మక్కు .. తెలంగాణా ప్రజల ఉసురు తగులుతుందన్న డీకే అరుణ
సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి దళితుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ నేతలు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే కెసిఆర్ కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని, అందుకే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి కొత్త మైండ్ గేమ్ కి తెర తీశారని విమర్శలు గుప్పిస్తున్నారు . ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాల విషయంలో కూడా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు . తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

కేసీఆర్ తెలంగాణా ద్రోహిగా మిగిలిపోతారు
తెలంగాణ రాష్ట్రానికి సీఎం కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని మండిపడిన డీకే అరుణ కృష్ణా జలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజ మెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తెలంగాణ సిఎం అడ్డుకోవడం లేదని మండిపడిన డీకే అరుణ సీఎం కేసీఆర్ చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని నిప్పులు చెరిగారు. నదీజలాల విషయంలో సీఎం కేసీఆర్ బయట చెబుతున్నదానికి చేస్తున్న దానికి పొంతన లేదని డీకే అరుణ విమర్శించారు.

జగన్ తో కుమ్మక్కై తెలంగాణాకు అన్యాయం
తెలంగాణ రాష్ట్రానికి 66 శాతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఉంటే 535 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, కానీ 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారని తద్వారా తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు అరుణ. జగన్ తో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. రాయలసీమపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకెళ్తుందని మండిపడ్డారు. 203 జీవో విడుదల చేసి 6 వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పేర్కొన్న డీకే అరుణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నడవడానికి అదే కారణమన్నారు. అటు ఇటు ఒకే కాంట్రాక్టర్ ప్రాజెక్టుల పనులు చేస్తున్నప్పటికీ ఎందుకు ప్రాజెక్టుల పనులు ఆపలేదని డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఏ ఒప్పందంతో కృష్ణాజలాలను ఏపీకి తాకట్టు పెట్టారని డీకే అరుణ నిలదీశారు. కెసిఆర్ కు తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు అని శాపనార్థాలు పెట్టారు. ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని మరీ కడతాను అన్న కెసిఆర్ ఏడేళ్లుగా ఎక్కడున్నారో చెప్పాలన్నారు.ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని డీకే అరుణ నిలదీశారు. పంతాలు, పట్టింపులకి వెళ్లి జూరాల దగ్గర ప్రాజెక్టును మార్చారని అరుణ నిప్పులు చెరిగారు.

కెసిఆర్ ఝూటాకోర్ అంటూ డీకే అరుణ ధ్వజం
జూరాల దగ్గర రోజు 5 టిఎంసిల నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టు కట్టాలని సీఎం కేసీఆర్ ను డీకే అరుణ డిమాండ్ చేశారు. కెఆర్ఎంబి టెలిమెట్రిస్ ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బిజెపి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్న డీకే అరుణ కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కెసిఆర్ ఝూటాకోర్ అంటూ డీకే అరుణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ కు మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్న అరుణ కెసిఆర్ ను, జగన్ ను తిట్టిపోశారు.












Click it and Unblock the Notifications