ఓటుకు రాకు.. కరోనాతో ఖతమైపోకు, రేపు మున్సిపల్ పోలింగ్ లో పాల్గొనవద్దన్న వరంగల్ డాక్టర్ !!
తెలంగాణ రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలలో రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేయాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఓటు కోసం బయటకు రావద్దని ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వైద్యుడు మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టాడు.
ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం, తెలంగాణా ప్రభుత్వంపై ఫైర్
కరోనా విలయం ..మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనవద్దని డాక్టర్ విజ్ఞప్తి
పరిస్థితులు బాగా లేవని ఎవరు బయటకు రావద్దని, ఓటింగ్లో పాల్గొనవద్దని డాక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటుకు రాకు కరోనాతో ఖతమై పోకు అంటూ వినూత్న నిరసన తెలియజేస్తున్నారు. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా కరోనాతో మేము పోరాడుతుంటే, మీ స్వార్థం కోసం ఎలక్షన్లు పెట్టి ఎంతమందిని కరోనాకు బలి తీసుకుంటారని సదరు వైద్యుడు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఓటింగ్లో పాల్గొనవద్దని, మీ ప్రాణాలకు మీరే రక్ష, ఓటు కోసం వచ్చిన ఎవరూ మీకు వైద్యం చేయించరు అంటూ వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు ఎంజీఎం ఆసుపత్రిలోని వైద్యుడు.
ఈ సమయంలో ఎన్నికలు అవసరమా ?
ఎంజీఎం ఆస్పత్రిలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులలో ఎలక్షన్స్ అవసరమా ? అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ రేపు పోలింగ్ కొనసాగనుంది. కరోనా మహమ్మారి కారణంగా నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు.దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడం ఎలా అన్న సందిగ్ధంలో ఉన్నారు.
ఓటర్లలోనూ కరోనా భయం ..ఓటు వేసేందుకు చూపించని ఆసక్తి
అసలే గ్రేటర్ ఎన్నికల్లో అధికారులు ఆశించినంత పోలింగ్ శాతం ఎప్పుడూ నమోదు కాదు. అలాంటి సమయంలో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో అసలు ఎలక్షన్ల పై ఎలాంటి ఆసక్తి కనిపించటంలేదు. ఈ పరిస్థితుల్లో వారు ఓటు వేయడానికి ఆసక్తి కూడా చూపించటం లేదు. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ ఎన్నికల్లో ఓటు వేయవద్దని, ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతుంది.
కక్కలేక మింగలేక కరోనా భయంతో అధికారుల ఎన్నికల విధులు
ఇక ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా ? అని రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలా ? అంటూ ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హుకుం జారీ చేసింది.ఇక అధికార యంత్రాంగం సైతం కక్కలేక మింగలేక కరోనా భయాల మధ్య ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు .