శవాలు లేస్తయ్ జాగ్రత్త.. డాన్ మల్లారెడ్డి ఇక్కడ!: 15మంది బౌన్సర్లతో సినిమాను తలపించే దాడి
ఇసుక రీచ్లు మణుగూర్ లో ఇప్పిస్తానని 10నెలల క్రితం వీరందరిని అక్కడికి తీసుకెళ్లాడు. కానీ ఇసుక రీచ్ ల వద్దకు తీసుకెళ్లకుండానే వారిని వెనక్కి తీసుకొచ్చాడు.
మంచిర్యాల: ఇసుక రీచ్లు ఇప్పిస్తానని లక్షల్లో డబ్బు గుంజిన వ్యక్తి.. తిరగబడిన బాధితుల మీదే 'డాన్' అంటూ బెదిరింపులకు దిగాడు. బౌన్సర్లను పెట్టి మరీ చితకబాదించాడు. ప్రజాప్రతినిధుల అండతోనే సదరు నయా డాన్ ఇంతలా రెచ్చిపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కొమ్మురెడ్డి మల్లారెడ్డి ఇసుక రీచ్ లు కాంట్రాక్టుకు ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన చింతం నరేశ్, చాక శ్రీనివాస్, చాక కొమురయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఆకుల శ్రీనివాస్, నక్కలపల్లికి చెందిన మామడి జలంధర్, సిద్దం రవికుమార్ ల వద్ద రూ.63లక్షలు గుంజాడు.
ఇసుక రీచ్లు మణుగూర్ లో ఇప్పిస్తానని 10నెలల క్రితం వీరందరిని అక్కడికి తీసుకెళ్లాడు. కానీ ఇసుక రీచ్ ల వద్దకు తీసుకెళ్లకుండానే వారిని వెనక్కి తీసుకొచ్చాడు. రోజుల గడుస్తున్న కొద్ది మల్లారెడ్డి తీరుపై బాధితులకు అనుమానం వచ్చింది. తీరా మోసపోయామని తెలుసుకున్న తర్వాత.. తమ డబ్బు తమకు ఇచ్చేయాల్సిందిగా బాధితులు ఒత్తిడి తెచ్చారు.
దీంతో రూ.19లక్షలను మల్లారెడ్డి బాధితులకు తిరిగి ఇచ్చేశాడు. మిగతా డబ్బుల కోసం జులై 6వ తేదీన గడువు పెట్టి.. మంచిర్యాల ఆర్&బీ గెస్ట్ హౌజ్ వద్దకు బాధితులను పిలిపించాడు.
ముందస్తు ప్లాన్ తో దాడి:
బాధితులు గెస్ట్ హౌజ్ వద్దకు రావడం కన్నా ముందే హైదరాబాద్ నుంచి బౌన్సర్లను తీసుకుని మల్లారెడ్డి అక్కడ వాలిపోయాడు. బాధితులు అక్కడకు రావడమే ఆలస్యం బౌన్సర్లు వారిపై విరుచుకుపడి తీవ్రంగా కొట్టారు.
'మల్లారెడ్డి అంటే చందారం మల్లారెడ్డి అనుకున్నార్రా!.. హైదరాబాద్ డాన్ మల్లారెడ్డి.. మరోసారి డబ్బుల విషయం తెస్తే శవాలు లేస్తాయ్ జాగ్రత్త..' అంటూ మల్లారెడ్డి వారిని హెచ్చరించాడు. దాడి అనంతరం బౌన్సర్లను తీసుకుని మంచిర్యాలలోని ఓ లాడ్జికి వెళ్లాడు. బాధితులు లక్సెట్టిపేటకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహాయంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు లాడ్జీని ముట్టడించి బౌన్సర్లను, మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఓ రివాల్వర్, 15బుల్లెట్లు, 3వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గతంలో స్థానిక చానెల్లో పనిచేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలతోను అంటకాగినట్లు విమర్శలు వస్తున్నాయి.