యశోద నుంచి నిమ్స్కు గుండె తరలింపు... అతని అదృష్టం కొద్దీ 24గంటల్లోనే దొరికిన ఆర్గాన్...
హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం(సెప్టెంబర్ 15) ఓ వ్యక్తికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారు. ఇందుకోసం మలక్పేట్ యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ చానెల్ ద్వారా గుండెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రెండు ఆస్పత్రుల మధ్య దూరం 11కి.మీ కాగా కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్ నిమ్స్ ఆస్పత్రికి చేరుకుంది.గుండెను తరలించే క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ముందే ఏర్పాట్లు చేశారు.
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పెయింటర్కు వైద్యులు ఈ గుండెను అమర్చనున్నారు. జీవన్దాన్లో నమోదు చేయించుకున్న 24 గంటల్లోనే అతనికి గుండె దొరకడం విశేషం. ఇది చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వీరబాబు అనే కానిస్టేబుల్ నుంచి గుండెను సేకరించి దాన్ని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమరుస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు గత నెల 12న గొల్లగూడెం వద్ద డ్డుప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో వీరబాబు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో అతని గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఇంతలో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెయింటర్ గుండె కోసం జీవన్ దాన్లో నమోదు చేయించుకున్నాడు. దీంతో వీరబాబు గుండెను అతనికి అమర్చనున్నారు. వీరబాబు అవయవ దానం ద్వారా అతని కుటుంబ సభ్యులు మరొకరి ప్రాణాలను నిలబెట్టగలిగారు.
గుండెమార్పిడి కోసం: మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి నిమ్స్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు#oneindiatelugu #greenchannel #nims pic.twitter.com/TNbS0TurYb
— oneindiatelugu (@oneindiatelugu) September 15, 2021
నిమ్స్లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. అయితే బయటి నుంచి గుండెను ఆస్పత్రికి తరలించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
సాధారణంగా దానాల్లోకెల్లా పలానా దానం గొప్పదనే మాట తరుచూ వింటుంటాం. కానీ అవయవ దానాన్ని మించిన దానం కంటే గొప్పది మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదేమో.అవయవ దానం చేయడమంటే ఒక మనిషికి పునర్జన్మను ప్రసాదించడం లాంటిదే. గతంతో పోలిస్తే అవయవ దానంపై ఇప్పుడు అవగాహన పెరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొస్తున్నారు. తద్వారా మరణం తర్వాత కూడా మరొకరి ప్రాణాలను నిలబెట్టగలుగుతున్నారు.
ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నందున జీవన్దాన్ కార్యక్రమం నెట్వర్క్తో అనుసంధానమైన ఆసుపత్రులకు రొటేషన్ పద్ధతుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. ఒత్తిడి వల్లనో, పలుకుబడితోనో అవయవాలు పొందాలన్నా పొందలేని విధంగా ఈ 30 ఆసుపత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్య క్రమాలూ... అన్నీ అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరబాటుకు తావుండదు. ఈ 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్డెడ్గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. ఒక వ్యక్తిని బ్రెయిన్డెడ్గా నిర్ణయించడం చాలా నిబద్ధతతో, నిష్ణాతులైనవారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇప్పటివరకూ 30 ఆస్పత్రులకు మాత్రమే అనుమతినిచ్చారు.
అవయవ దానంపై ప్రజల్లో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. మరణించిన వ్యక్తిని ఖననం చేయడం ద్వారా అతని అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దానికి బదులు మరొకరికి అవయవ దానం చేయడం ద్వారా వారి ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఈ చైతన్యం మరింత పెరిగితే మున్ముందు మరింత మంది ప్రాణాలు నిలబడుతాయి.