కరోనా విలయం: రాష్ట్రంలో ఫేక్ డేటా -టెస్టుల గోల్మాల్ -సంచలన కథనం -హైకోర్టు ఆగ్రహం
దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతుండటం, మెట్రోపాలిటన్ నగరాల్లోకెల్లా హైదరాబాద్ లోనే వైరస్ వ్యాప్తి స్వల్పంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే తక్కువగా నిర్వహిస్తోన్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో భారీ ఎత్తున గోల్ మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రముఖ మీడియా సంస్థ 'ది హిందూ' ప్రచురించిన సంచలన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభ
పీహెచ్సీల ద్వారా ప్రక్రియ
రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా ప్రైమరీ హెల్త్ సెంటర్ల(పీహెచ్సీ) ద్వారా ప్రభుత్వం కరోనా టెస్టులు, చికిత్స విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో పీహెచ్సీ పరిధిలో ఒక రోజులో ఎంత మందికి టెస్టులు చేశారు, ఎన్ని పాజిటివ్ గా తేలాయి అనే వివరాలను వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్ లతో సహా పకడ్బందీ రికార్డును నిర్వహించాల్సి ఉండగా, చాలా చోట్ల నకిలీ పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో ఫేక్ టెస్టుల ఫలితాలు, పాజిటివ్ కేసులను ప్రకటించారని ‘ది హిందూ' తెలిపింది.
86 సెకన్లలో టెస్టు ఫలితం..
ర్యాండమ్ గా కొన్ని పీహెచ్సీలను ఎంచుకుని వాటిలో నమోదైన డేటాను క్షుణ్నంగా పరిశోధించగా, 110 పీహెచ్సీల్లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు టెస్టులు, కేసుల సమాచారంపై అనుమానాలు తలెత్తాయి. తన పరిశీలనలో భాగంగా ‘ది హిందూ' రిపోర్టర్ కరోనా టెస్టు చేయించుకోగా కేవలం 86 సెకన్లలోనే అతడికి ఆన్లైన్ ద్వారా టెస్టు ఫలితాన్ని పంపారు. తొలినాళ్లలో నెమ్మదిగా సాగిన టెస్టుల ప్రక్రియ.. హైకోర్టు ఆగ్రహం తర్వాత వేగం పెరిగింది. ఒక్కో పీహెచ్సీలో రోజుకు గరిష్టంగా 60 టెస్టులు, ఏరియా ఆస్పత్రుల్లోనైతే రోజుకు 200 టెస్టులు నిర్వహించాలని ఉన్నతాధికారులు టార్గెట్ విధించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఒకే ఫోన్ నంబర్తో పలు రిజిస్ట్రేషన్లు చేయడం, జనం ఇళ్లకే పరిమితమైపోయిన వదరలు, గ్రేటర్ ఎన్నికల సందర్భంలోనూ టెస్టులు, కేసుల సంఖ్యలను యధావిధిగా పేర్కొనడం లాంటివి అనుమానాలను మరింత బలపర్చాయని ‘ది హిందూ' తెలిపింది.
ఒకే నంబర్తో వేర్వేరు పేషెంట్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగిన డిసెంబర్ 1న సిటీలోని టెస్టింగ్ సెంటర్లో 60 మంది పరీక్షలు చేయించుకోగా, అసద్ అనే పేరుతో ఓ పేషెంట్ ఫోన్ నంబర్ నమోదైంది. తర్వాతి రోజు అదే నంబర్ తో మరో వ్యక్తికి టెస్టు జరిగినట్లుగా రికార్డుల్లో ఫేక్ ఎంట్రీ చేశారు. డిసెంబర్ 3న గ్రేటర్ పరిదిలో 5,003 టెస్టులు చేయగా, 141 మంది పాజిటివ్ గా తేలారు. తద్వారా పాజిటివిటీ రేటు 3 శాతంగా నమోదైంది. కానీ వైద్య శాఖ ఇచ్చిన కరోనా బులెటిన్లో మాత్రం 109 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లుగా వచ్చిందని కథనంలో పేర్కొన్నారు.
3టీలపై గందరగోళం
పరిస్థితి ఇలాగే కొనసాగితే పెను ప్రమాదానికి దారి తీసే అవకాశాలు లేకపోలేవని, కరోనా కట్టడిలో ప్రధామిక సూత్రమైన 3టీలు (ట్రేసింగ్, టస్టింగ్, ట్రీటింగ్) పక్కాగా అమలు చేయకుంటే అసింప్టమాటిక్ కేసులు విపరీతంగా ఉండే అవకాశముందని, అదీ కాకుండా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం వల్ల రేప్పొద్దున వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురుకావొచ్చన్న నిపుణుల వ్యాఖ్యలను సైతం కథనానికి జోడించారు.
కొవిడ్ ప్రోటోకాల్ ఏం చెబుతోంది?
మిగతా రాష్ట్రాలన్నీ ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలో టెస్టులు చేపడుతుండగా, వాటికి భిన్నంగా తెలంగాణలో 80 శాతం టెస్టులను ఆర్ఏటీ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో హైకోర్టు ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా రోజుకు 50వేలకు తక్కువ కాకుండా టెస్టులు జరపాలని హైకోర్టు ఆదేశించిన తర్వాతే ప్రభుత్వం వేగం పెంచింది. కానీ అందులోనూ గోల్ మాల్ జరుగుతున్నట్లు ‘ది హిందూ' కథనంతో బయటపడినట్లయింది. దీనిపై ప్రభుత్వ వివరణ వెలువడాల్సిఉంది.
జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం