కేసీఆర్ మొనగాడు: ద్రోణంరాజు, కాళ్లకు నమస్కరిస్తానని గజల్ శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై అఖిల భారత బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రశంసలు కురిపించారు. బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేయడమేగాక, ఆయుత చండీయాగం వంటి విశిష్ట ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
హిందుత్వాన్ని చాటే ఆయుత చండీయాగాన్ని విజయవంతంగా నిర్వహించిన కేసీఆర్ కాళ్లకు నమస్కరిస్తానని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు.
బ్రాహ్మణ్స్ యూనిటీ ఫర్ ఎవర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకొని ఆదివారం హైదరాబాద్లోని పద్మారావునగర్ కౌతా కామకోటి కళ్యాణ నిలయంలో వారు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిలభారత బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయుత చండీయాగం చేసి కేసీఆర్ మొనగాడనిపించుకున్నారని ద్రోణంరాజు అన్నారు. బాహ్మణుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావును రాజ్యసభకు ఎంపిక చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్కు ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అంటే కొందరు ఆక్షేపించడం పట్ల ద్రోణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరి, కృష్ణమోహన్, ఆనంద్, శర్మ, భానుమూర్తి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications