నన్ను లాగుతారా?: కవితపై అరవింద్ ఆగ్రహం, సాయంత్రం కేసీఆర్తో డీఎస్ భేటీ
Recommended Video
హైదరాబాద్: తన తండ్రి డి శ్రీనివాస్ పైన నిజామాబాద్ ఎంపీ, జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలపై ఆయన తనయుడు అరవింద్ బుధవారం స్పందించారు. కవిత, తెరాస నాయకుల లేఖలో అపరిపక్వత కనిపిస్తోందన్నారు. టీఆర్ఎస్ నేతల ఆరోపణలు పరస్పరం విరుద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం కవితకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్లోకి డీఎస్?: ఢిల్లీలో కదలికలపై టీఆర్ఎస్ కన్ను, కేసీఆర్ వేటు వేసే ఛాన్స్
టీఆర్ఎస్ రాజకీయాల్లోకి తనను లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కొడుకుపై కోపంతో తండ్రిపై చర్యలు విడ్డూరమన్నారు. ఇది హాస్యాస్పదం కూడా అన్నారు. టీఆర్ఎస్ నేతల లేఖలో రాజకీయ పరిపక్వత లేదన్నారు. ఇదిలా ఉండగా, తెరాస తనపై చర్యలు తీసుకోవడానికి ముందే డీఎస్ మరో ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
అవమానకర వ్యాఖ్యలు
ఈ రోజు టీఆర్ఎస్ చేసిన తీర్మానంలో తన పేరును ప్రస్తావించడాన్ని తాను ఖండిస్తున్నానని అరవింద్ చెప్పారు. తన తండ్రి ఓ పార్టీలో ఉండి మరో పార్టీ కోసం పని చేసే రకం కాదని చెప్పారు. ఇక తెరాసలోని అంతర్గత విభేదాలతో తనకు సంబంధం లేదన్నారు. ఓడిపోతాననే కోపం, భయాన్ని కవిత.. డీఎస్ పైన చూపిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. డీఎస్ పైన కవిత అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు.
రాజీనామా చేసే ఆలోచనలో డీఎస్
తనపై చర్యలు తీసుకోవాలంటూ కవిత, నిజామాబాద్ జిల్లా నేతల ఫిర్యాదు నేపథ్యంలో డి శ్రీనివాస్ రాజీనామాకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పార్టీ చర్యలు తీసుకోవడానికి ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని యోచిస్తున్నారట. తెరాసలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఫిర్యాదు నేపథ్యంలో పార్టీని వీడాలను భావిస్తున్నారట.
గులాం నబీ ఆజాద్తో భేటీ అయ్యారా?
డీఎస్ ఇటీవల రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో చర్చలు జరిపారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు, బుధవారం నిజామాబాద్లో కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. తెరాసను వీడే అంశంపై చర్చించారని తెలుస్తోంది.
సాయంత్రం 6 గంటలకు కేసీఆర్తో డీఎస్ భేటీ
తనను ఓసారి కలవాలని డీఎస్కు కేసీఆర్ అపాయింటుమెంట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు డీఎస్ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చెబుతారు, ఈయన ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఆయనను కేసీఆర్ బుజ్జగిస్తారా లేక వెళ్లిపోతానంటే ఊరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.