పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె లేదని .. డ్రామాలకు కేరాఫ్ కేసీఆర్, హరీష్ : దుమ్ము రేపిన దుబ్బాక ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, హుజురాబాద్ ఎన్నికల రాజకీయంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు పై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మోకాలికి గాయమై, సర్జరీ చేయించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దిగజారుడు వ్యాఖ్యలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆగిన చోట నుండే పాదయాత్ర మళ్ళీ .. ఈటల కోసం అభిమానుల పూజలు, బండి సంజయ్ పరామర్శ
ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టె లేదని నువ్ చేసింది డ్రామా కాదా ?
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి బిజెపి నాయకులు వీల్ చైర్ లో, స్ట్రెక్చర్లపై వస్తున్నారు అంటూ దిగజారి మాట్లాడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నవంబరు 29వ తేదీన సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలో పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించిన హరీష్ అగ్గిపెట్టె కోసం ఎదురు చూసి చేసింది డ్రామా కాదా అంటూ నిలదీశారు. లీటర్ పెట్రోల్ తెచ్చుకున్న ఆయన రూపాయి అగ్గిపెట్టె ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు రఘునందన్ రావు.
డ్రామాలకు పర్యాయపదం టీఆర్ఎస్
తెలంగాణ ఉద్యమం నాటి పేపర్ క్లిప్పింగ్ ను మీడియాకు చూపించిన రఘునందన్ రావు, అసలైన ఆత్మ బలిదానం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టిఆర్ఎస్ ఇచ్చిన స్థానం ఏంటి అని ప్రశ్నించారు. శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికి అర్హురాలు కాదా అని నిలదీశారు. డ్రామాలకు పర్యాయపదం టీఆర్ఎస్ అని రఘునందన్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. డ్రామాలు అంటేనే కెసిఆర్ కుటుంబమని, సినీ నటుల కంటే గొప్ప నటులు కెసిఆర్, హరీష్ రావు అని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వటానికి కారణం కేసీఆర్ కాదా ?
ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి పిసిసి పదవి కూడా కేసీఆర్ అని, ఇది నిజమో కాదో కాలమే సమాధానం చెబుతుందని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు హరీష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్ ఆత్మ గౌరవ అజెండాతో ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కానీ ఊహించని విధంగా అనారోగ్యం బారిన పడటంతో పాదయాత్రకు బ్రేక్ పడింది.
ఈటల రాజేందర్ అనారోగ్యం పెద్ద డ్రామా అన్న హరీష్ రావు
ఈటల రాజేందర్ అనారోగ్యం పెద్ద డ్రామా అంటూ తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు తాజాగా వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు హుజరాబాద్ లో బిజెపి గెలిచిన నయాపైసా ఉపయోగం ఉండదని హుజురాబాద్ మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలతో సిద్దిపేట లో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో గాయాలైనట్లు, అనారోగ్యానికి గురైనట్టు ఒళ్లంతా పట్టీలు కట్టుకుని తిరుగుతూ సానుభూతి సంపాదించే పార్టీ ప్రచార ప్రణాళికలోభాగమే ఈటల రాజేందర్ కాలికి ఆపరేషన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
హరీష్ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
బిజెపి కొత్త డ్రామాలకు తెర లేపింది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వీల్ చైర్ లో కూర్చుని ప్రచారం చేస్తే సానుభూతి ఓట్లు పడతాయని భావిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణా ఉద్యమ సమయంలో హరీష్ చేసిన ఘనకార్యం ఇదే అని గుర్తు చేస్తూ మీ కంటే డ్రామాలు చెయ్యగల వాళ్ళు తెలంగాణా రాష్ట్రంలో లేరని రివర్స్ పంచ్ వేశారు .