దుమ్ముగూడెం అక్కర్లేదు: హరీష్, అడవులపై కెిసఆర్
హైదరాబాద్: దుమ్ముగూడెం ప్రాజెక్టు తెలంగాణకు ఏ మాత్రం ఉపయోగపడదని, దాన్ని రద్దు చేసుకోవాలని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులనన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికపద్దులపై జరిగిన చర్చ సందర్భంగా సోమవారం మంత్రి ప్రసంగించారు.
ఈపీసీ సిస్టమ్ ఇకపై రాష్ట్రంలో ఉండదని తెలిపారు. ఎల్ఎస్ సిస్టమ్లోనే టెండర్లును పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకతీయ రాజుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి గనుక చెరువు నిండితే వచ్చే నాలుగు సంవత్సరాల వరకు గ్రామాలకు ఎలాంటి లోటు ఉండదని వివరించారు.

అటవీశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి సీఎస్ రాజీవ్శర్మ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, అటవీశాఖ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో అడవులను పెంచాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకే అటవీ భూముల కాని అందులో అడవిలేదని తెలిపారు. అటవీ భూములను సమర్థవంతంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.
అడవుల పెంపకానికి అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని అన్నారు. హరితహారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 5 వందల ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూరు తరహాలో ఫారెస్టు కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని తెలిపారు. అటవీ భూముల చుట్టూ కందకం తవ్వి కంచె వేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో పచ్చదనం ఆచరణలో కనిపించాలని కోరారు. పండ్లు, పూల చెట్లతో ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. గ్రామాల్లో దోమలు రాకుండా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడుతాయన్నారు. నగరంలోని గుర్రంగూడెం, దూలపల్లి, ఎస్ఆర్ నాయక్ నగర్, కొండ్లకోయ, హరిణ వనస్థలి ప్రాంతాల్లోని ఫారెస్టు బ్లాకులను రక్షించాలని అన్నారు. బ్లాకుల చుట్టూ కేబీఆర్ పార్కు మాదిరిగా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications