కేసీఆర్ను చిక్కుల్లో పడేసిన హిందూ గాళ్లు బొందుగాళ్లు కామెంట్..?
Recommended Video
హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సఘం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వాడిన పదజాలంపై విశ్వహిందూ పరిషత్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసుల్లో పేర్కొంది. లేదంటే మరోసారి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని ఈసీ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
మార్చి 17వ తేదీన కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి రుజువులతో సహా సమర్పించారు. "ఈ హిందూ గాళ్లు...బొందుగాళ్లు.. దిక్కుమాలిన దరిద్రపుగాళ్లు" "దేశంలో అగ్గిపెట్టాలే గట్టర్ లేవాలే" అంటూ కేసీఆర్ పరుష పదప్రయోగం వినియోగించారని రామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఇంగ్లీషులో తెప్పించుకుంది. కేసీఆర్ ప్రసంగంను ఇంగ్లీషులో తర్జుమా చేసి పరిశీలించింది. పూర్తిగా విన్న కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించింది.ఇటు సామాజికంగాను అటు మతపరంగాను వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావించింది. కేసీఆర్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.