తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఈసీ రెడ్ సిగ్నల్..మూడు కారణాలు చూపిన ఎన్నికల సంఘం
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీలోనే పర్యటిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ఈసీ సనద్ధంగా లేనట్లు సమాచారం. తెలంగాణలో తాము ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేక పోతున్నామనేదానిపై ఈసీ మూడు కారణాలు చూపింది.
2019 జనవరి 1న తెలంగాణలోని ఓటరు నమోదు కార్యక్రమం ముగుస్తుంది. దీన్ని ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ మండలాలకు తెలంగాణ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్లోని నియోజకవర్గాలతో కలపాల్సి ఉంది. ఇక మూడో కారణంగా... 1999 నుంచి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకే సారి జరుగుతుండగా... ఈ సారి ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలన్న తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ సంతృప్తికరంగా లేదని తెలిపింది.
ఈసీ ఇచ్చిన వివరణతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ప్రధానిని కలిసేందుకు ఆగమేఘాలపై ఢిల్లీకి బయలుదేరారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీతో కలిసి సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేలా చూడాలని చెప్పేందుకే ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లేఖను కూడా ఈసీ ప్రస్తావించింది. జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలను కోరడమేంటని కూడా ఈసీ ప్రశ్నించింది.
ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 10న రద్దయితే.... ఎన్నికల నిర్వహణకు ఆరునెలల సమయం ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే మార్చిలో నిర్వహించాల్సి ఉంటుందని చెప్పిన అధికారులు... ఇక ఒక నెలకే అంటే ఏప్రిల్ 2019లో సాధారణ ఎన్నికలు వస్తాయన్నారు. ఆ ఒక్క నెలకోసం ఒక్క రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తే రూ.3వేల కోట్లు అదనపు ఖర్చు అవుతుందని దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది. 1999 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2014లో ఏపీ విభజన జరిగినప్పటికీ.. అదే ఏడాది ఏప్రిల్/మేలో ఎన్నికలు జరిగాయి. మరోవైపు VVPAT మెషీన్లను తొలిసారి దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ సిబ్బందికి VVPAT మెషీన్లపై సెపరేటుగా ట్రైనింగ్ ఇవ్వడం కుదరదన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐటీ ఆఫీసర్ల కేటాయింపు ప్రాసెస్ ప్రారంభమైందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈసీని ఒప్పించి ఎన్నికలు డిసెంబర్లోనే నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదే అంశంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన కూడా కాస్త స్పష్టతనిచ్చింది. ముందస్తు ఎన్నికలపై త్వరలోనే అంటే మరో వారం పదిరోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. అంటే సెప్టెంబర్ 2న జరిగే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కూడా ముందస్తు ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం లేదనే భావించాలి.