సంక్షోభంలో పడిన విద్యారంగం..! ఆత్మహత్యలే అందుకు నిదర్శనమన్న ప్రొఫెసర్ హరగోపాల్..!!
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో పడిందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షల ఫలితాల్లో అవకతవకలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరనే అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికీ తేల్చకపోవడం, కేబినెట్ మీటింగ్ గానీ, నిపుణులతో సమావేశం గానీ నిర్వహించకపోవడం దారుణమని అన్నారు.
సీఎం చంద్రశేఖర్ రావు తనకు ఇవేవీ పట్టనట్లు కేరళలో తిరుగుతున్నారని విమర్శించారు. విద్యారంగాన్ని మూలాలకు వెళ్లి సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు చక్రధర్రావు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని, గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ మూడు రోజులగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఎస్ఎఫ్ఐ-డీవైఎఫ్ఐ ప్రతినిధులు విరమించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య వారికి నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. గాంధీ ఆస్పత్రిలో పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రామయ్య.. వారి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. పోరాడి సాధించాలే తప్ప.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దంటూ సర్దిచెప్పారు.