వర్షం తెచ్చిన విషాదం: విద్యుత్ షాక్తో నలుగురు కుటుంబసభ్యులు మృతి
మెదక్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ ఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. భార్య, భర్త సహా ఇద్దరు పిల్లలు మరణించారు. మృతులను హైమద్(35), పర్వీన్(30), అద్నాన్(4), మహిమ్(6)గా గుర్తించారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. ఇంట్లోనే బట్టలు ఆరేసుకున్నారు. అయితే, ఈ తీగ విద్యుత్ తీగకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై కుటుంబంలోని నలుగురు కూడా మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి పోటెత్తిన వరద
నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి పోటెత్తింది వరద. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, జలాశయం ప్రస్తుత నీటిమట్టం 695 అడుగులకు చేరింది. జలాశయంలోకి చేరుతున్న 2,22,412 క్యూసెక్కుల నీటిలో.. 16 గేట్ల ద్వారా 2,25,796 క్యూసెక్కుల విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
వరదలో చిక్కుకున్న 9 మంది కూలీలు
వరదలో చిక్కుకున్న 9 మంది కూలీలలో ఫోన్లో మాట్లాడారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లాలోని అక్కడి పరిస్థితిని ఆరాతీశారు మంత్రి.రాయికల్ మండలం కురులో వరదలో చిక్కుకున్నారు కూలీలు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.