కొంత గోప్యత!: నయీం ఎన్కౌంటర్పై ఎస్పీ రమారాజేశ్వరి, రూ.కోటితో దొరికాడు
మహబూబ్ నగర్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ పైన మహబూబ్ నగర్ ఎస్పీ రమా రాజేశ్వరి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులను చూడగానే నయీం అనుచరులు దాడికి యత్నించారన్నారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారన్నారు.
తనకు రూ.కోటి ఇవ్వాలని ఓ వ్యాపారిని నయీం బెదిరించాడని చెప్పారు. నయీం డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పారిపోయాడన్నారు. ఎన్కౌంటర్లో నయీం చనిపోయాడని చెప్పిన ఎస్పీ.. ఎక్కువ వివరాలు మాత్రం వెల్లడించలేదు.
పక్కా సమాచారంతో జరిపిన దాడిలో నయీం చనిపోయాడని చెప్పారు. అయితే నయీం తలదాచుకున్న భవనంలో ఎంత మంది ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? అనే వివరాలను వెల్లడించలేదు. భవనంలో ఇంకా పరిశీలన కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్కౌంటర్లో ఓ మెషీన్ గన్, మరో పిస్టల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నయీం
విద్యార్థి నాయకుడి నుంచి గ్యాంగ్స్టర్ వరకు ఎదిగిన నయీమ్ నల్గొండ జిల్లా భువనగిరి నుంచే ప్రస్థానం ప్రారంభించాడు. తండ్రి విద్యుత్శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. తొలుత ఎస్ఎఫ్ఐలో కొనసాగిన నయీమ్ తర్వాత పీపుల్స్ రాడికర్స్ స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
నయీం
1990 పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో ఎస్పీ వ్యాస్ హత్య కేసుతో తెరపైకి వచ్చాడు.
నయీం
కొంతకాలం తర్వాత మళ్లీ అరెస్టయి జైల్లోనే పీపుల్స్వార్ వ్యతిరేక కార్యకలాపాలు నడిపాడు. మాజీ నక్సలైట్లు, ప్రజా సంఘాల నేతలు, పౌరహక్కుల నేతల హత్యకేసుల్లో ఏ-1 నేరస్థుడిగా ఉంటూనే నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భూదందాలు, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు తదితర నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు.
నయీం
దీంతో పోలీసులు నయీంపై ఒత్తిడి తెచ్చేందుకు అతడి అనుచరులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరిలో షకీల్ అనే వ్యక్తి మృతి చెందగా.. పాశం శ్రీనివాస్, సుధాకర్లు అనే నిందితులు ఇటీవల నల్గొండ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.