రాంగోపాల్ వర్మ ‘దిశ’ విడుదల చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: దోషుల ఫ్యామిలీ
హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఆ కేసులో దోషుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయ కమిషన్ను సోమవారం ఆశ్రయించారు.
దిశ కేసులో కేసులో ఎన్కౌంటర్ అయిన దోషులు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్ కుటుంబసభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ న్యాయ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
చనిపోయిన వారి ఆత్మ క్షోభించేలా ఈ చిత్రం తీసి తమను ఇంకా చంపుతున్నారని కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు న్యాయ కమిషన్లో విచారణ కొనసాగుతుంటే 'దిశ' కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నించారు. స్థానికంగా తాము అనేక అవమానాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సినిమా విడుదలైతే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
కాగా, ఇప్పటికే ఈ సినిమాను ఆపాలని 'దిశ' తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.