టీఆర్ఎస్ సభ: ఊహించని అభివృద్ధి సాధించామన్న కేకే, తెలంగాణా బాహుబలి సీఎం కేసీఆరే అన్న కడియం
వరంగల్ లో టీఆర్ఎస్ ‘ప్రగతినివేదన సభ' మొదలైంది. తొలుత రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఊహించని అభివృద్ధిని సాధించామన్నారు.
వరంగల్ : వరంగల్ లో టీఆర్ఎస్ 'ప్రగతినివేదన సభ' మొదలైంది. తొలుత రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఊహించని అభివృద్ధిని సాధించామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటు పడుతున్నదని ఉద్ఘాటించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ నిండాయని తెలిపారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందజేస్తామని, ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ. 4 వేలు చొప్పున ఇస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని కేకే గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ ఉదార స్వభావి...
దేశంలో ఏ సీఎం కూడా రైతుల పట్ల ఇంత ఉదార స్వభావంతో లేరంటూ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. రైతు రాజ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, ప్రజలకు అనుగుణంగానే ప్రభుత్వం తన పాలనను సాగిస్తున్నదని తేల్చి చెప్పారు. సంక్షేమంలో నెంబర్వన్లో ఉన్నామని పేర్కొన్నారు.
మనసున్న మారాజు...
అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో ఏకైక బాహుబలి సీఎం కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైసీపీ, టీడీపీకి స్థానం లేదన్నారు. తెలంగాణలో బీజేపీకి అసలు పునాదుల్లేవని చెప్పారు. రైతులు, పేద వారి ఆకలి గురించి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచించలేదని, సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని కొనియాడారు.
ఆడపడుచులకు ‘అన్న'..
ఆసరా పింఛన్లతో గ్రామాల్లోని ప్రజల ముఖాల్లో వెలుగులు నిండాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని తేల్చిచెప్పారు. ఆడపడుచులందరికీ అన్నగా సీఎం కేసీఆర్ ఆసరాగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గర్భిణి స్త్రీలకు ఆర్థిక సాయం కింద రూ. 12 వేలతో పాటు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్ అందిస్తున్నామని చెప్పారు.
పేదింటి ఆడపిల్లలకు ‘మేనమామ'..
పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ మేనమామగా కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 75 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ను ఆశీర్వదించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన రైతులందరికీ కడియం కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమానికి రూ.40 వేల కోట్లు...
బడ్జెట్లో 40 వేల కోట్లు సంక్షేమానికి కేటాయించి దేశంలో ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచామన్నారు.
వచ్చే ఏడాదికల్లా.. ఇంటింటికీ మంచినీరు
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామని కడియం శ్రీహరి చెప్పారు. ప్రతి ఇంటికి మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించారని తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇంటింటికీ మంచినీరు అందిస్తామని స్పష్టం చేశారు.