నల్లమలలో మళ్ళీ టెన్షన్ ... ఆ గ్రామాల్లో జెట్ విమానం చక్కర్లు కొట్టటమే రీజన్
నల్లమలలో యురేనియం నిక్షేపాలు కోసం అన్వేషణ కొనసాగుతోందా? ఒకపక్క యురేనియం వెలికితీతకు అనుమతులు ఇవ్వబోమని చెబుతున్న ప్రభుత్వం మరోపక్క యురేనియం వెలికితీతపై దృష్టి పెడుతుందా ? తాజాగా నల్లమలలో జెట్ విమానం భూమికి దగ్గరగా చక్కర్లు కొట్టడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెరపైకి నల్లమల యురేనియం వివాదం
నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం తిరగటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. నల్లమల ఏజెన్సీ గ్రామాల్లో చాలా సేపు జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులలో ఆందోళన మొదలైంది. యురేనియం వెలికితీతకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న నల్లమల ప్రాంతవాసులు నిన్ను జెట్ విమానం చక్కెర్లు కొట్టడంతో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు.

యురేనియం నిక్షేపాలున్న ప్రాంతాల్లో జెట్ విమానం సంచారం
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిలో మంగళవారం జెట్ విమానం చక్కర్లు కొట్టింది. భూమికి అతి సమీపంలోకి వచ్చి జెట్ విమానం తిరగడంతో యురేనియం నిక్షేపాల కోసమేనా అన్న అనుమానం గిరిజనుల్లో వ్యక్తమైంది. ముఖ్యంగా యురేనియం నిక్షేపాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ జెట్ విమానం సంచరించింది.

యురేనియం నిక్షేపాల కోసమే అని గిరిజనుల అనుమానం
నల్గొండ జిల్లా నేరేడు గొమ్ము, చందంపేట మండలం లోని గుట్టలు, నాగార్జున జలాశయం పైన కూడా ఈ జెట్ విమానం పలుమార్లు చక్కర్లు కొట్టింది. అయితే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే చేపట్టి ఉంటారని, ఇదంతా యురేనియం నిక్షేపాలు కోసమేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెల రోజుల క్రితం కూడా ఓ హెలికాఫ్టర్ ఈ ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. జెట్ విమానాలు,హెలికాఫ్టర్ లు తిరుగుతుండటం యురేనియం నిక్షేపాల కోసమేనా అని భయాందోళనలో ఉన్నారు స్థానిక ప్రజలు. ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు.

యురేనియం వెలికితీత విషయంలో గిరిజనుల భయం
ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియంపై ఎటువంటి సర్వేలు లేవని ప్రకటిస్తుండగా,ఈ విధంగా హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూస్తుంటే యురేనియం వెలికితీతకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందేమోనని గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకపక్క యురేనియం వెలికితీత చేయబోమని చెప్తూనే మరోపక్క అమ్రాపూర్ మండలంలోని తిరుమలాపురం లోతట్టు అటవీ ప్రాంతంలో యురేనియం బోరు పాయింట్లు గుర్తిస్తున్నట్లుగా గిరిజనులు చెప్తున్నారు. ప్రభుత్వం యురేనియం వెలికితీత ఆలోచన విరమించుకోకుంటే ఉద్యమిస్తామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications