టిడిపి వ్యూహం, గెలిస్తే సీమాంధ్రులకు డి.మేయర్: కెటిఆర్ సవాల్కు ఎర్రబెల్లి సై
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే తాము సీమాంధ్రులకు డిప్యూటీ మేయర్ పదవిని ఇస్తామని తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం నాడు చెప్పారు. హైదరాబాదులోని సీమాంధ్రులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రుల పైన విరుచుకుపడిన టిఆర్ఎస్.. ఇప్పుడు వారి ఓట్లుకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టిడిపి.. మరో అడుగు ముందుకేసి తాము గెలిస్తే సీమాంధ్రులకు డిప్యూటీ మేయర్ కట్టబెడతామని చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే సీమాంధ్ర గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేటర్నే డిప్యూటీ మేయర్ చేస్తామన్నారు. హైదరాబాదు అభివృద్ధికి సీమాంధ్రులే కారణమన్నారు.
ఆస్తులు అమ్ముకుని వచ్చి మరీ పెట్టుబడులు పెట్టి హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దారని ఆకాశానికెత్తారు. సీమాంధ్రులు టీడీపీతో ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అబద్ధాలు చెప్పి సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రతిపక్షాలు రాజీనామా చేస్తాయా? అని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను ఎర్రబెల్లి స్వీకరించారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటమిపాలైతే కేటీఆర్ రాజీనామా అవసరం లేదని, టీడీపీలో పోటీ చేసి, టీడీపీ పెట్టిన భిక్షతో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్తారా? అని సవాల్ విసిరారు. దీనికి కేటీఆర్ సై అంటే తాము కూడా సై అని ఆయన ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్ సవాళ్లు కొత్తకాదన్నారు.