ఆంధ్రా మంత్రులూ! మాకు వదిలేయండి: ఎర్రబెల్లి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నామినేటెడ్, ఇతర పదవులను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకే ఇవ్వాలని, ఇందుకు ఆంధ్రా ప్రాంత మంత్రులు, నేతలు సహకరించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు కోరారు.
తాము తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఒక కేంద్రమంత్రి పదవి తెలంగాణ నేతకు ఇవ్వాలన్నారు. తెలంగామలో పార్టీని తప్పకుండా అధికారంలోకి తెస్తామని చెప్పారు.
కాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వస్తుందనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. గురువారం నాడు మహానాడు వేదికగా ఆ చర్చ జరగడం గమనార్హం.
చంద్రబాబు, మోత్కుపల్లి నర్సింహులుల ఆసక్తికర చర్య నేపథ్యంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దాదాపు ఖాయమని అర్థమవుతోంది.
ఎక్కడో యువకుడిగా ఉన్న తనను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేశారని, ఇప్పుడు బాబు గవర్నర్ చేస్తానని చెబుతున్నారని మోత్కుపల్లి మహానాడు వేదికపై అన్నారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. మోత్కుపల్లి వెళ్లిపోతే గట్టిగా అరిచేవారు ఉండరని చమత్కరించారు. దానికి మోత్కుపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు.