టీఆర్ఎస్ ధర్నాతోనే కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసింది .. ఎర్రబెల్లి సెన్సేషన్, మరీ ఇలా చెప్తే నమ్మొద్దా?
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ మహాధర్నా కారణంగానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని, ఇది టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల జనం నవ్వుతున్నారు. ఏదైనా చెప్తే నమ్మేలా చెప్పాలంటూ తెలంగాణ మంత్రి తీరుపై చలోక్తులు విసురుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నాలు, ఆందోళనలతో కేంద్రం దిగొచ్చిందన్న మంత్రి ఎర్రబెల్లి
ఇంతకీ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నాలు, ఆందోళనలతో కేంద్రం దిగొచ్చిందని, కేసీఆర్ మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. బీజేపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం వెనుక టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళన ఉందని వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని మరిచి, కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు అండగా సియం కేసిఆర్ నిలిచారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పోరాటంతోనే మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను కేసీఆర్ మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు
బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి విజయాన్ని సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండగా ముఖ్యమంత్రి కేసిఆర్ నిలిచారని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సియం కేసిఆర్ ఆదేశాలతో పార్లమెంట్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేశారని అన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సియం కేసిఆర్ రైతుల పక్షాన నిలబడేందుకు దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసేందుకు శ్రీకారం చుట్టి ధర్నాలు చేపట్టడంతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం దిగివచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

సాగు చట్టాలపై పోరాటం స్పూర్తిగా ధాన్యం కొనుగోలు కోసం ఉద్యమం
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు టిఆర్ఎస్ పార్టీ చేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా ఉన్నారని అన్నారు. నూతన చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించి రైతాంగానికి అండగా నిలిచారని అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ఒకరోజు టీఆర్ఎస్ మహా ధర్నాతో కేంద్రం దిగొస్తే ఏడాదికి రైతుల ఉద్యమం దేనికి ? అంటూ సెటైర్
ఇప్పటికైనా బిజెపి, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. ఇప్పటికైనా బిజేపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ది తెచ్చుకోని రైతు వ్యతిరేక నిర్ణయాలను వదిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని సూచించారు. ఇక ఎర్రబెల్లి వ్యాఖ్యలతో ఒక్క టీఆర్ఎస్ మహా ధర్నాతో కేంద్రం దిగొస్తే ఏడాదిగా దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసిన రైతుల ఆందోళన దేని కోసం చేసినట్టు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం మరీ ఇంతగా నమ్మశక్యం కాని విషయాలు చెప్తే ఎలా మంత్రి గారూ అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications