ఇప్పుడు కేసీఆర్ అంటే కుట్రలు, డబ్బు, అణచివేత: 50వేల కోట్లిస్తామన్నారంటూ ఈటల రాజేందర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తాను ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ శివారు శామీర్పేట నివాసంలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారని గుర్తు చేశారు.

అప్పుడు కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పడు కుట్రలను..
నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తనను అవహేళన చేశారని ఈటల గుర్తు చేసుకున్నారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని విమర్శించారని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లామని, ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారని అన్నారు. అప్పుడు కేసీఆర్ ధర్మాన్ని, ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు, కుట్రలు, అణచివేతలను నమ్ముకున్నారని దుయ్యబట్టారు. తనను బతికి ఉండగానే బొందపెట్టాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంత్రివర్గంలో ఇతరులెవరికీ అధికారాలు లేవని అన్నారు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదన్నారు. నల్గొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.

బెంజికారులో తిరిగేవారికి రైతుబంధు ఎందుకని ప్రశ్నించా?
తాను సంక్షేమ పథకాలను వ్యతిరేకించలేదని ఈటల అన్నారు. రైతు బంధును ఆదాయపన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని.. వ్యవసాయం చేయనివారికి రైతుబందు ఇస్తే ఉపయోగం ఉండదని, పొలం సాగు చేస్తున్న రైతులకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని కేసీఆర్కు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. బెంజికారులో తిరిగేవారికి రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. గ్రామాలు బాగుపడకుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తాయంటే తప్పా అని ప్రశ్నించారు.

తనపై కుట్రలన్న ఈటల.. ఒక్క మంత్రికీ స్వేచ్ఛ లేదు..
తాను నయీం బెదిరింపులకు కూడా భయపడలేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వందలాది మంది బలిదానాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పారు. తనపై తప్పుడు రాతలతో కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. కష్టపడి పనిచేస్తేనే తనకు పదవులిచ్చారన్నారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ హయాంలో తెచ్చుకున్న గోదాములను మూయించేశారని చెప్పారు.

హుజురాబాద్ ప్రజలు కుట్రలను బొందపెడ్తారు
119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులపై కేసీఆర్కు నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలపై నమ్మకముంటుందా? అని ఈటల ప్రశ్నించారు. మొదట మెజార్టీ లేదని టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజంలో తాను సంపాదించుకున్న పేరును దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. హుజురాబాద్ ప్రజలు డబ్బు సంచులను, కుట్రలు, కుతంత్రాలను బొందపెడతారని అన్నారు. జర్నలిస్టు రఘు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ఈటల.. వెంటనే ఆయనపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు.

50వేల కోట్లిస్తామన్నా.. అంగీకరించలేదన్న ఈటల
రాష్ట్రంలో రెండేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు 50వేల కోట్లు ఇస్తామంటూ ఏపీ నుంచి కొందరు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని.. కానీ తాను వెనక్కి పోలేదన్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేద్దామనే అంశాన్ని కూడా తాను వ్యతిరేకించలేదన్నారు. దిక్కులేనినాడు మిమ్మల్ని మోసిన వ్యక్తులు.. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల వ్యాఖ్యానించారు. తాను బానిసను కాదని, ఉద్యమకారుడ్ని అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచానని చెప్పిన ఈటల రాజేందర్.. కేసీఆర్ తన ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారని అన్నారు. నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటు ఉంటుందా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే, ప్రజలతోనే ఉంటానని ఈటల వ్యాఖ్యానించారు. తనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, నేతలు తుల ఉమ, బాబన్న తోపాటు పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications