అసెంబ్లీ సమావేశాల నుండి ఈటల రాజేందర్ సస్పెన్షన్.. శాసనసభలో క్షమాపణ చెప్పాలని రచ్చ!!
తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ ఈటల రాజేందర్ ను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసన సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
శాసనసభలో ఈటల అనుచిత వ్యాఖ్యలపై రచ్చ
సస్పెన్షన్ కు ముందు శాసనసభలో టిఆర్ఎస్ సభ్యులకు, ఈటల రాజేందర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈటెల రాజేందర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈటల రాజేందర్ సభా గౌరవాన్ని పాటించలేదని ఆయనను సస్పెండ్ చేయాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్ ను మరమనిషి అని ఈటల రాజేందర్ సంబోధించడం పై సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల సభకు క్షమాపణ చెప్పాలన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈటలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఈటల రాజేందర్ బేషరతుగా శాసనసభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈటల రాజేందర్ కి సభలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన ను అడ్డుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ సభ కు క్షమాపణ చెప్పిన తర్వాత చర్చలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, సభలో చర్చలో పాల్గొనడం కంటే బయట రచ్చ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
ఈటల కావాలనే సస్పెండ్ చేయించుకుంటున్నారు
స్వయంగా సస్పెండ్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తాము ఈటల రాజేందర్ సభలో ఉండాలని కోరుకుంటున్నామని, అయితే ఆయన సభకు క్షమాపణ చెప్పాలని ఆ తర్వాత జరిగే అన్ని చర్చల్లో పాల్గొనాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అలా జరగని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఈ క్రమంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షమాపణలు చెప్పని ఈటల .. సభలో తీరుపై ఆగ్రహం
సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం తనకు ఉందా? లేదా? అంటూ ప్రశ్నించిన ఈటల, బెదిరిస్తున్నారా? ఏం చేస్తారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను స్పీకర్ పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదని ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పకపోవడంతో సభ నుండి సస్పెండ్ చేయాలంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఈటల రాజేందర్ ను సభ నుండి సస్పెండ్ చేశారు.