రేవంత్ రెడ్డిని కలవటం చట్ట విరుద్ధమా? కలిస్తే అందుకేనా? కేటీఆర్ కు ఈటల, రఘునందన్ రావు కౌంటర్ !!
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు ప్రత్యారోపణలతో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై టిఆర్ఎస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని, బిజెపి కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థి నిలబెట్టిందని ఈటల రాజేందర్ గోల్కొండ హోటల్లో రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా నిజామాబాద్, కరీంనగర్ లలో టిడిపి నేతలు కుమ్మక్కై బీజేపీ అభ్యర్థులను గెలిపించి నిజం కాదా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ .. రేవంత్ రెడ్డిని కలిశా .. అయితే ఏంటి?
ఇక ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. రేవంత్ రెడ్డి ని స్టార్ హోటల్ లో కలిశానని కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సమాధానమిచ్చిన ఈటల రాజేందర్ తాను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిశానని, అందులో భాగంగానే తాను రేవంత్ రెడ్డిని కూడా కలిశానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ని కలవడం చట్టవిరుద్ధం అయితే కాదు కదా అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఎవరినైనా కలిస్తే తప్పుడు ప్రచారం చెయ్యటమేనా ?
ఎవరినైనా కలిస్తే పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం చేయడం చాలా నీచమైన పని అంటూ ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఏ అవసరంతో కలిసినా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కలిశామని చెప్పడం కరెక్ట్ కాదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కలుసుకునే వాతావరణాన్ని కూడా కెసిఆర్ పొల్యూట్ చేస్తున్నాడని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఇప్పటికే బీజేపీ నేతలు బిజెపికి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని, అలాంటి కాంగ్రెస్ పార్టీతో తాము కలిశామని టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఓటమి భయంతోనే కేటీఆర్ తప్పుడు ప్రచారం
ఇక హుజురాబాద్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ స్థానం ఏమిటి అని ప్రశ్నించిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఎక్కడా కూడా కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేయలేదని, చెయ్యవని రఘునందన్ రావు తేల్చిచెప్పారు. ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారానికి తెర తీశారని మండిపడ్డారు. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ భాగస్వాములయ్యారు అన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్న రఘునందన్ రావు ఓటింగ్ పర్సంటేజ్ ను తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ ఆపలేరన్న రఘునందన్ రావు
హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ ఆపలేరని రఘునందన్ రావు తేల్చిచెప్పారు. అనవసరంగా తప్పుడు ప్రచారానికి తెర తీసి టిఆర్ఎస్ పార్టీ అభాసుపాలు అవుతుందంటూ ఎద్దేవా చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఏది ఏమైనా ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని కలిశాడని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుండి ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి బిజెపికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని కేటీఆర్ ఆరోపిస్తుండగా, ఆ ఆరోపణలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.












Click it and Unblock the Notifications