నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణా సీఎం కేసీఆర్ పై, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, అనేక ప్రశ్నలు సంధించి చర్చకు రెడీనా అంటూ సవాల్ విసిరారు.
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తాజాగా బడ్జెట్ సమావేశాలపై, ప్రధాన నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి కేటీఆర్, హరీష్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో కేటీఆర్ ఈటల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కు ఈటల రాజేందర్ సవాల్
తెలంగాణా సీఎం కెసిఆర్ ఆస్తులపై మాట్లాడిన ఈటల రాజేందర్ తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఆస్తులు ఎన్ని ఉన్నాయని.. ప్రస్తుతం కెసిఆర్ ఆస్తులు ఎన్నో చెప్పాలని సవాల్ విసిరారు. 2014లో నీ ఆస్తులు.. నా ఆస్తులు.. 2023 లో నీ ఆస్తులు.. నా ఆస్తులు ఎంతో చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు. పార్టీ నుంచి తాను వెళ్ళిపోలేదని, పార్టీ నుంచి తనను బలవంతంగా వెళ్లగొట్టారని పేర్కొన్న ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తనను చిల్లర గుండా నాయకులతో తిట్టిస్తున్నారని పేర్కొన్న ఈటల రాజేందర్ తెలంగాణ కోసమే పుట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటికైనా భూమి మీద నడవాలంటూ మండిపడ్డారు.

అది నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్న ఈటల
రాష్ట్రంలో రైతులకు ఎప్పుడు 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నావో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒకవేళ ఎక్కడైనా వస్తుందని నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ఇన్కమ్ టాక్స్ ఎగవేత కోసం తోటలు పెట్టుకున్న వారికి రైతుబంధు అవసరమా అంటూ నిలదీశారు. మాదిగలకు ఒక్క మంత్రిత్వ శాఖ కూడా లేదన్న ఈటల 0.6% ఉన్న మీ సామాజిక వర్గానికి అన్ని మంత్రి పదవులు అంటూ ఆరోపణలు గుప్పించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నైజం కెసిఆర్ దని ఈటెల అసహనం వ్యక్తం చేశారు. పార్టీని చీటర్లను, బ్రోకర్లను పెట్టుకొని నడుపుతున్నారంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

కేసీఆర్ ఒక్కరే 30లక్షల రైతు బంధు తీసుకుంటున్నారు
మీ ప్రభుత్వంలో ఎంత మంది బీసీమంత్రులు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించిన ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి తనని ఎందుకు పిలవలేదని నిలదీశారు. కెసిఆర్ ఒక్కరే 30 లక్షల రైతుబంధు తీసుకుంటున్నారని, రైతుబంధు పై సీలింగ్ ఉండాలని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు రైతుబంధు ఎందుకని ప్రశ్నించారు. 52 శాతం మంది ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే మంత్రి కేటీఆర్, హరీష్ రావు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

దేశంలోనే కేసీఆర్ ది దారుణ పాలన
దేశంలోనే అందరికంటే దారుణంగా పాలన సాగిస్తుంది ఒక కేసీఆర్ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఐదు లక్షల కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది నిజం కాదా అంటూ ఈటల రాజేందర్ నిలదీశారు. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు అప్పులక్ష 25 వేల రూపాయలని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. మోడీ 100 లక్షల కోట్ల అప్పు చేశారని కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications