వారిని వెంటనే బర్తరఫ్ చెయ్యండి కేసీఆర్.. ఈటల రాజేందర్ డిమాండ్!!
బీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేల గురించి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ దళిత బంధు డబ్బులు తిన్న ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మూడు లక్షల రూపాయల డబ్బులు ఎమ్మెల్యేలు ఎవరెవరి వద్ద తీసుకున్నారో వారందరికీ డబ్బులు వాపసు ఇప్పించాలని ఆయన సూచించారు. కెసిఆర్ హామీ ఇచ్చినట్టు దళితులు అందరికీ దళిత బంధు ఇవ్వాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో 2 లక్షల కోట్లతో ఒక్కో దళితుడికి 10 లక్షల రూపాయలు ఇస్తానని కెసిఆర్ "దళితబంధు" పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే అందరు దళితుల కుటుంబాలకు దళిత బంధు అందలేదన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో 17,600కు పైగా కుటుంబాలకు దళిత బంధు ఇస్తా అన్నారు .. ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు 3,000 కుటుంబాలకు అసలే రాకపోగా.. చాలా కుటుంబాలకు రెండవ విడత అందలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు "దళితబంధు" డబ్బుల నుండి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నారు అని స్వయంగా సీఎం చెప్పారని పేర్కొన్నారు.
పత్రికలో, ప్రతిపక్షాలో ఈ ఆరోపణ చేయలేదన్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేల పైన ఆయనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనే స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందన్నారని దుయ్యబట్టారు. దళిత బంధు పథకంలో ఇచ్చే డబ్బు పేదల డబ్బు అని పేర్కొన్న ఆయన, వారి డబ్బు తీసుకోవడం నేరం, జుగప్సాకరం అంటూ మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంటనే ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చెయ్యాలన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, లాండ్ మాఫియా ఇప్పుడు ఇది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్నారని తెలిసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications