ఈటల రాజేందర్, రాజాసింగ్ హౌస్అరెస్ట్.. ఆందోళనలకు టీఆర్ఎస్ కు మాత్రమే అనుమతులా? భగ్గుమన్న బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం నాడు జనగామలో బీజేపీ కార్యకర్తల పై జరిగిన దాడులకు నిరసనగా బిజెపి జనగామ మౌనదీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ పిలుపునిచ్చిన మౌనదీక్షకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను, అలాగే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారు.
ఈటల రాజేందర్ హౌస్ అరెస్టు.. మండిపడిన ఈటల
జనగామ ప్రధాన కూడలిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో గాయపడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లడానికి సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా అంటూ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఇలా తనను అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని ఈటల రాజేంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు ప్రజా సంఘాలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దెబ్బలు తిన్న వారి మీదనే పోలీసులు కేసులు పెడుతున్నారని అసహనం
తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి జనగామ వెళ్లాలనుకున్నా అని కానీ పోలీసుల తీరు సరిగా లేదని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కు వంత పాడుతున్నారు అని మండిపడ్డారు. ఇది ఎంతో కాలం చెల్లదని పేర్కొన్నారు. దెబ్బలు తిన్న వారి మీదనే పోలీసులు కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులకు లేదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ ఈటల రాజేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని పేర్కొన్న ఈటల రాజేందర్, తెలంగాణ గురించి ప్రధాని మోడీ మాట్లాడారని, నాడు బిజెపి మద్దతుతోనే తెలంగాణ వచ్చిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ ... పోలీసులపై మండిపడిన రాజా సింగ్
ఇక ఇదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ని సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాష్ట్రంలో అన్ని అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు శాంతియుతంగా ఆందోళన చేసే అవకాశం కూడా లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి తాను జనగామ వెళ్లాలనుకున్నాను అని, కానీ పోలీసులు తనను గృహ నిర్భంధం చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.
జనగామలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఇదిలా ఉంటే బుధవారంనాడు రాజ్యసభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ గా బీజేపీ కార్యకర్తలు నిరసన చేశారు. దీంతో టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత మురళీధర్ రావు పరామర్శించారు.