Etela Rajender : ఈటల రాజీనామాకు స్పీకర్ ఆమోదం-ఉపఎన్నికకు కౌంట్ డౌన్ స్టార్ట్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈటల రాజీనామా లేఖ సమర్పించిన రెండు గంటల వ్యవధిలోనే స్పీకర్ దాన్ని ఆమోదించడం గమనార్హం. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండటంతో ఎలాంటి అడ్డంకులు ఎదురవలేదు. స్పీకర్ ఆమోదంతో హుజురాబాద్ ఉపఎన్నికకు లైన్ క్లియర్ అయింది.
అంతకుముందు,శనివారం(జూన్ 12) ఉదయం శామీర్పేటలోని తన నివాసం నుంచి అనుచరులు,మద్దతుదారులతో కలిసి ఈటల గన్పార్క్కి చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... ఉపఎన్నికలో తనదే విజయమన్న ధీమా వ్యక్తం చేశారు.

17 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశానని... విలువలు, నిబద్దతతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్ల పొడుస్తూ కొందరు అధికార పార్టీలో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. తన డీఎన్ఏ ఒకప్పుడు లెఫ్ట్ కావొచ్చు... కానీ ఇప్పుడు తన టార్గెట్ తెలంగాణలో నియంతృత్వ పాలనకు సమాధి కట్టడమేనని అన్నారు.
హుజూరాబాద్లో జరిగే ధర్మయుద్ధంలో ప్రజల తన వెంటే ఉంటారని... విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇది కౌరవులకు,పాండవులకు మధ్య జరిగే యుద్ధమన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి,కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతున్న ఉపఎన్నిక అన్నారు. అధికార దుర్వినియోగం ద్వారా ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని... వడ్లు తడిచి మొలకలు వచ్చినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని... యువతకు ఉద్యోగాలు,ఉపాధి లేకుండా పోయాయని అన్నారు. తనకు నిర్బంధాలు కొత్త కాదని... నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. తనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమ,కేశవరెడ్డి,గండ్ర నళిని బీజేపీలో చేరుతారని తెలిపారు.
నిజానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని నేరుగా కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించాలని ఈటల భావించినప్పటికీ... ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఈటల... ఈ నెల 14న బీజేపీ అగ్ర నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications