మల్లారెడ్డిపై దాడి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత; కేసీఆర్ పీకేను తెచ్చుకున్నది అందుకే: ఈటల రాజేందర్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారింది. మంత్రి మల్లారెడ్డి పై దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టేది లేదని తెలంగాణ మంత్రులు తేల్చి చెప్తుంటే, మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి వ్యక్తిగత దాడి కాదని ప్రభుత్వం పై రైతులకు ఉన్న వ్యతిరేకత అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు.

దేశ ప్రధానికి గౌరవం ఇవ్వకుండా పిలవని రాష్ట్రాలకు వెళ్తున్న కేసీఆర్
గతంలో ఎన్నడూ లేనివిధంగా టిఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓటు బ్యాంకు కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశ ప్రధాని కి కనీసం గౌరవం కూడా ఇవ్వని కెసిఆర్ పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారంటూ విమర్శించారు. కెసిఆర్ గెలవలేకనే ప్రశాంత్ కిషోర్ ను అరువు తెచ్చుకుంటున్నారని విమర్శించారు ఈటల రాజేందర్. కెసిఆర్ రైతులకు రుణమాఫీ చేయకుండా డిఫాల్టర్ గా మారారని మండిపడిన ఈటల రాజేందర్ పరిపాలన చేతకాకపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

తెలంగాణా ఖజానాపై శ్వేతపత్రం విడుదల చెయ్
సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని వర్గాలకు అన్యాయం చేశారంటూ, ఆయన పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్ర ఖజానా కెసిఆర్ వల్ల దివాలా తీసిందని ఖజానాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. అంతే కాదు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి మాటలు ఆయన అహంకారానికి అద్దంపడుతున్నాయి అంటూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదని ఈటల వెల్లడించారు. కులం పునాదుల మీద ఏ పార్టీ సాగదని పేర్కొన్నారు ఈటల రాజేందర్. ఇక ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న వారిని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

రెడ్డి సింహగర్జన సభ.. మల్లారెడ్డిపై దాడి.. కేసులు నమోదు
ఇదిలా ఉంటే ఆదివారం నాడు జరిగిన రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన పై దాడికి యత్నించారు నిరసనకారులు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి తనను చంపాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని, తనపై జరిగిన దాడి రేవంత్ రెడ్డి కుట్రేనని ఆరోపణలు గుప్పించారు. తనపై దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందంటూ మల్లారెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై 16 మంది పై ఐదు సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications