ఆటలు సాగవనే సస్పెన్షన్: స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికం; 17న నిరసనదీక్ష: ఈటల రాజేందర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుండి బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. టిఆర్ఎస్ ఆటలు సాగవని మా పై సస్పెన్షన్ విధించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 80 రోజులు జరుగుతాయని ఈ కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పైన చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్న ఈటల రాజేందర్, ప్రజా సమస్యలపై చర్చించడానికి బిజెపి ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు.
Recommended Video
తమ సస్పెన్షన్ కారణం చెప్పిన ఈటల
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేదని తెలిపితే తమను సస్పెండ్ చేశారని, అయితే అసలు కారణం వేరే ఉందని పేర్కొన్న ఈటల రాజేందర్ బిజెపి ఎమ్మెల్యేలు సభలో ఉంటే తమ ఆటలు సాగవన్న కారణంతోనే టిఆర్ఎస్ తమను సస్పెండ్ చేసిందని వెల్లడించారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తనను మాట్లాడకుండా చెయ్యాలని బయటకు పంపించారు అంటూ ఈటల రాజేందర్ విమర్శించారు. ముఖ్యంగా తనను అసెంబ్లీకి రాకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూశారని ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు.
బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో నో ఎంట్రీ అన్న స్పీకర్
స్పీకర్ సీఎం కనుసన్నలలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల చివరి రోజున అయినా సభలో పాల్గొందామని ప్రయత్నం చేసిన బీజేపీ నేతలకు భంగపాటు ఎదురయింది. కోర్టు సూచనల మేరకు మరోమారు స్పీకర్ ను కలవాలని బిజెపి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసినా అసెంబ్లీలో ఎంట్రీకి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నో చెప్పారు. అసెంబ్లీలో కి వెళ్లిన ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్ లు ముందు అసెంబ్లీ సెక్రటరీ ని కలిసి, ఆపై స్పీకర్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు.
స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికం.. 17న ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష
దీని పై మండిపడిన ఈటల రాజేందర్ కోర్టు సూచనలు, తమ అభ్యర్థనను కూడా సభాపతి తిరస్కరించారని వెల్లడించారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ ఆ పనిచేయకపోవడం బాధాకరమని, ఆయన నిర్ణయాన్ని అప్రజాస్వామికంగా భావిస్తున్నామని ఈటల రాజేందర్ వెల్లడించారు. తమను అప్రజాస్వామికంగా సభ నుండి సస్పెండ్ చేయడంపై నిరసనగా ఈనెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు.
వారిని తెలంగాణా ప్రజలు సస్పెండ్ చేస్తారు: ఈటల
బీజేపీ మీద అనేక విమర్శలు చేసిన కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత ఎక్కడ పడుకున్నారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజేందర్ కెసిఆర్ కు చురకలంటించారు. దేశ్ కి నేత కేసీఆర్ అని వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లు ఖర్చుపెట్టి పేపర్లలో యాడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు అంటూ విమర్శించారు. కెసిఆర్ ది దుర్మార్గపు పాలన అని, ముఖ్యమంత్రిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తమను సస్పెండ్ చేసినట్టే వారిని కూడా తెలంగాణ ప్రజలు త్వరలోనే సస్పెండ్ చేస్తారంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.