ఈటలా ఇదేనా నీ అనుభవం?, స్పీకర్ కు క్షమాపణలు చెప్పాల్సిందే: మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈటల అహంకారంతో మాట్లాడుతున్నారని, 20 ఏళ్లు అనుభవం ఉందని చెబుతూ సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం విచారకరమన్నారు. తన అనుభవంలో నేర్చుకునేది ఇదేనా? అని ప్రశ్నించారు. స్పీకర్ నిబంధనల మేరకు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని, సభ్యుల సంఖ్యను బట్టి బీఏసీలో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి బీఏసీలో అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. దేశ మంతటా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీలో ఉన్న ఈటలతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి భయపడి నిబంధనలు మారుస్తామా? అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే.. లోక్సభ స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా? అని ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ ను అవమానిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచినట్లేనని అన్నారు.స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటి రెండుసార్లు ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications