ఈటల రాజేందర్ మోకాలికి సర్జరీ.. మరో వారం ఆస్పత్రిలోనే.. పాదయాత్రపై అనుమానాలు..?
మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్కు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రి వైద్యులు మోకాలి సర్జరీ చేశారు. వారం రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. 10 రోజులు గడిస్తే తప్ప పాదయాత్రపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు.దీంతో ఈటల ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగుతుందా... లేక శాశ్వత బ్రేక్ పడుతుందా అన్న సందిగ్ధం నెలకొంది.
సాధారణంగా మోకాలి సర్జరీ అయిన తర్వాత వైద్యులు కొంతకాలం బెడ్ రెస్ట్ సూచిస్తారు. ఒకవేళ త్వరగానే కోలుకున్నా... ఎక్కువ దూరం నడిచే రిస్క్ చేయవద్దని చెబుతారు. అలా చేస్తే సమస్య మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు బెడ్ రెస్ట్లోనే ఉండమని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఆస్పత్రి నుంచి వచ్చాక పాదయాత్ర చేయడం అనుమానమే అన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఈటల పాదయాత్ర చేయని పక్షంలో ఆయన సతీమణి జమునా రెడ్డి పాదయాత్రను కొనసాగించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈటలకు ఆరోగ్యం సహకరించని పక్షంలో మిగతా పాదయాత్రను ఈటల జమునారెడ్డి కొనసాగించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం జుమనా రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆమె పాదయాత్ర చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకానొక సమయంలో ఈటల జమునా రెడ్డే పోటీలో దిగబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో... తమ ఇద్దరిలో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని జమునా రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీన్నిబట్టి ఇద్దరిలో ఎవరు పోటీలో ఉంటారనేది చివరి నిమిషంలో నిర్ణయిస్తారేమోనన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైతే హుజురాబాద్ గ్రౌండ్లో ఈటల మినహా మరో పార్టీ అభ్యర్థి కనిపించట్లేదు. అధికార పార్టీ సైతం ఇప్పటికీ అభ్యర్థి అన్వేషణలోనే ఉంది. అన్నింటికీ మించి అసలు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనేది పెద్ద సస్పెన్స్గా మారింది.
కాగా,జులై 19న కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 350కి.మీ మేర పాదయాత్ర తలపెట్టిన ఈటల... ఇప్పటివరకూ 70 గ్రామాలను చుట్టి 222కి.మీ యాత్ర పూర్తి చేశారు. శుక్రవారం(జులై 30) వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్ర సాగగా... మధ్యాహ్న భోజన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్,బీపీ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి ఆయన్ను తరలించారు.ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.