హుజురాబాద్లో ఈటల ఓటమి పక్కా-చేజేతులా నాశనం చేసుకున్నాడు-మరో 20 ఏళ్లు టీఆర్ఎస్సే-గుత్తా
హుజురాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈటల తన రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నాడని పేర్కొన్నారు. కేవలం ఆస్తుల రక్షణ కోసమే ఆయన బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో గుత్తా ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
Recommended Video

హత్యలుండవ్... ఆత్మహత్యలే...
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని... ఎవరూ ఎవరినీ నాశనం చేయలేరని ఈటలను ఉద్దేశించి గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు. మరోవైపు,దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని గుత్తా పేర్కొన్నారు. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని... నియోజకవర్గాల డి-లిమిటేషన్ కూడా పూర్తవుతుందని తెలిపారు.

ఆపరేషన్ హుజురాబాద్...
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 'ఆపరేషన్ హుజురాబాద్'పై పూర్తి ఫోకస్ పెట్టింది. త్వరలోనే మంత్రులు,ఎమ్మెల్యేలు,సీనియర్ నేతలను అక్కడ మోహరించే ప్లాన్లో ఉంది. ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలు పార్టీ నుంచి జారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. హుజురాబాద్లో ఈటలను ఏకాకిని చేస్తే రాజకీయంగా ఆయన్ను చావుదెబ్బ తీయవచ్చునని భావిస్తోంది. ఇందుకోసం శక్తియుక్తులన్నీ కూడగట్టే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ డైరెక్షన్స్ మేరకు హరీశ్ రావు ఆపరేషన్ హుజురాబాద్ ప్లాన్ అమలుచేయబోతున్నట్లు చెబుతున్నారు.

ఈటల చేరికకు అంతా సిద్దం...
ఈటల విషయానికి వస్తే... ఈ నెల 14న కాషాయ గూటికి చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందే ఈటల స్పీకర్కు రాజీనామా లేఖను పంపించే అవకాశం ఉంది. ఈటల రాకతో రాష్ట్రంలో తమ బలం పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటలను గెలిపించుకుని.. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పాలనుకుంటోంది.












Click it and Unblock the Notifications