జగ్గారెడ్డికి కోర్టులో షాక్, జైలుకు తరలింపు: ఇలా చేసి దొరికిపోయారు, అసలేం జరిగింది?
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అక్రమ పాస్ పోర్టుల కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో చుక్కెదురైంది. మరోవైపు, జగ్గారెడ్డి పదిరోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను వాయిదా వేసింది.
మానవ అక్రమ రవాణా?: ఆ ఫ్యామిలీని అమెరికాలోనే వదిలేశారు, జగ్గారెడ్డి అరెస్ట్
జగ్గారెడ్డిని పోలీసులు రిమాండుకు తరలించారు. మానవ అక్రమ రవాణా, పాస్పోర్ట్ దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిని సికింద్రాబాద్ సిటీ సవిల్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
జగ్గారెడ్డి, నిర్మల, భరత్, విజయలక్ష్మి పేరుతో పాస్పోర్ట్
2004లో జగ్గారెడ్డి, నిర్మల, విజయలక్ష్మి, భరత్ల పేరుతో పాస్పోర్టు పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నలుగురిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. పాస్పోర్ట్ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్, జగ్గారెడ్డి పీఏ రాజేందర్, మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. పాస్పోర్టులో ఉన్న ఫోటోలు జగ్గారెడ్డి ఫ్యామిలీవి కాదని రాజేందర్ తెలిపారు.
జగ్గారెడ్డి ఇలా దొరికిపోయారు!
ముగ్గురిని అమెరికా పంపించేందుకు ఏజెంట్ మధుతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు ధ్రవీకరణ పత్రాలతో పాస్పోర్టులు పొందారు. వీసా వచ్చిన తర్వాత స్నేహితుడితో కలిసి ఆ ముగ్గురిని జగ్గారెడ్డి న్యూయార్క్కు తీసుకు వెళ్లారు. 2016లో పాస్ పోర్ట్ పోయిందని కొత్త పాస్పోర్ట్ కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
అరెస్ట్ ఇలా
హ్యూమన్ ట్రాఫికింగ్ కింద సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. సమాచారం మేరకు సుమోటోగా కేసు నమోదు చేసిన మార్కెట్ స్టేషన్ పోలీసులు ఆయనపై సోమవారం ఉదయం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న జగ్గారెడ్డిని ముత్తంగి వద్ద అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి నేరుగా బంజారాహిల్స్లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పలు గుర్తింపు కార్డులు, ఫొటోలు స్వాధీనం చేసుకున్న అనంతరం సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
రూ.15 లక్షలు పొందారు
దీనిపై డీసీపీ సుమతి మాట్లాడుతూ... 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇతరులను తన కుటుంబ సభ్యులుగా చూపించి పాస్పోర్టులు పొందారని, వాళ్లు తన కుటుంబం అని, పాస్పోర్టులు ఇవ్వాలని 2004 సెప్టెంబరులో ఎమ్మెల్యే హోదాలో ప్రాంతీయ పాస్పోర్టు అధికారులకు జగ్గారెడ్డి లేఖ రాశారని, దీనికోసం తన భార్య, ఇద్దరు పిల్లల స్థానంలో వేరే వాళ్లను చూపించారని, తన కుటుంబ సభ్యుల పేరుమీద మంజూరు చేసిన పాస్పోర్టులు ఉపయోగించి చెన్నైలోని యూఎస్ఏ కాన్సులేట్ నుంచి వీసాలు పొందారని, ఐదు వీసాలు పొందిన జగ్గారెడ్డి అదే ఏడాది ముగ్గురితో పాటు అతని స్నేహితుడు జెట్టి కుసుమ కుమార్తో కలిసి అమెరికా వెళ్లారని, అక్కడ ఐదురోజులు పాటు ఉండి అనంతరం జగ్గారెడ్డి, అతని స్నేహితుడు జెట్టి కుసుమ కుమార్ మాత్రమే హైదరాబాద్ తిరిగి వచ్చారని, ఏజెంట్ మధు ద్వారా అమెరికా తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదిరిందని, ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ.15లక్షలు జగ్గారెడ్డి లబ్ది పొందారని తెలిపారు.
అక్రమంగా అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి
ఇటీవల పాస్పోర్ట్ కోసం జగ్గారెడ్డి చూపిన పత్రాలు, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన పోలీసులు.. రెండింటికి పొంతన లేదని గుర్తించి, ఆధారాల కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు, ఆధార్ కార్డులు, ఫోటోలు సేకరించారు. తన పాస్పోర్టు పోయిందంటూ 2016 జనవరిలో మరో కొత్త పాస్పోర్టును జగ్గారెడ్డి పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ జగ్గారెడ్డి తెరాసపై ండిపడ్డారు.