ఒళ్లు దగ్గర పెట్టుకోండంటూ టీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి దానం వార్నింగ్
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.
హైదరాబాద్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న సందర్భంగా దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ నేతల వైఖరిపై మండిపడ్డారు. ‘‘టీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. లేకపోతే అధికారం పోయాక వారికీ ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడులను ఇక ఎంతమాత్రం సహించేది లేదు'' అని ఆయన ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ నేతల ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు.