తేల్చిసినట్లేనా-బీజేపీ గూటికి ఈటల?-ఫాంహౌస్ వేదికగా రహస్య మంతనాలు-ఢిల్లీ నుంచి బీజేపీ దూత
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న ఈటల రాజేందర్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. బీజేపీలో చేరాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందిందనేది ఆ వార్త సారాంశం. కేంద్రమంత్రి,బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లతో సోమవారం(మే 24) రాత్రి ఈటల భేటీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీలో చేరాలని... కేసీఆర్పై కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా ఈటలకు బీజేపీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి బీజేపీ దూతగా జాతీయ నేత భూపేంద్ర యాదవ్ కూడా వచ్చినట్లు సమాచారం.
ఫాం హౌస్ వేదికగా మంతనాలు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో బీజేపీ ముఖ్య నేతలతో ఈటల సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,మరో నేత వివేక్ వెంకటస్వామి హాజరైనట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని... కేసీఆర్ను ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన ఆప్షన్ అని సమావేశంలో బీజేపీ నేతలు ఈటలకు వివరించినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ఈటల హుజురాబాద్లోని తన అనుచరులు,కార్యకర్తలతో సంప్రదించాక నిర్ణయం వెల్లడిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
అత్యంత రహస్యంగా సమావేశం
మొయినాబాద్లోని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫాంహౌస్లో అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తాాజా సమావేశంలో ఈటలకు బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత భూపేంద్ర యాదవ్ కూడా ఈటలకు దీనిపై హామీ ఇచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈటల బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.
బీజేపీ వైపే మొగ్గు...
తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లారో... కేసీఆర్,టీఆర్ఎస్లపై పోరులోనూ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని ఈటల ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలకు అతీతంగా ఆయన ఎంతోమంది నేతలతో సంప్రదింపులు జరిపారు.
మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,జితేందర్ రెడ్డి,బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులతో మంతనాలు జరిపారు. ఒకానొక సమయంలో ఈటల కాంగ్రెస్కు దగ్గరగా జరుగుతున్నట్లు కనిపించింది. అయితే చివరకు ఆయన బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఎందుకు బీజేపీలోకి..?
ఇటీవల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టి మరో తప్పు చేయవద్దని ఈటలకు సలహా ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయవద్దని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈటలపై భూకబ్జా,అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడమే అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అలా అయితేనే కేసీఆర్ను ఎదుర్కోగలమని... కాంగ్రెస్లో చేరడం ద్వారా ఒరిగేదేమీ లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ నేతలకు ఈటల తన మనసులో మాట తెలియజేశారని... అందుకే పార్టీలో వేగంగా మంతనాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్,ధర్మపురి అరవింద్ లాంటి బీసీ నేతలు బీజేపీలో ముందు వరుసలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈటల కూడా బీజేపీలో చేరితే పార్టీలో బీసీ నాయకత్వం మరింత బలపడుతుందని... భవిష్యత్తులో ఇది బీసీ సామాజికవర్గాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు దోహదపడుతుందని కమలం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.