10 గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ, కీలక సమాచారం వెల్లడి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను పదిగంటలపాటు సిట్ అధికారులు విచారించారు. తొలిరోజు డ్రగ్స్ కేసులో విచారణ పూర్తైంది. గురువారంనాడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు విచారణకు హజరుకానున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను పదిగంటలపాటు సిట్ అధికారులు విచారించారు. తొలిరోజు డ్రగ్స్ కేసులో విచారణ పూర్తైంది. గురువారంనాడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు విచారణకు హజరుకానున్నారు.కీలక సమాచారాన్ని పూరీ ఇచ్చారని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
రాజధాని నగరాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ను సుమారు పదిగంటలపాటు విచారించారు. బుదవారం ఉదయం పదిన్నర గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చిన పూరీ జగన్నాథ్ విచారణ రాత్రి 8.40 గంటలకు ముగిసింది.
ఈ విచారణలో పూరీ జగన్నాధ్ను ఎక్సైజ్ శాఖాధికారులు పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కెల్విన్తో ఉన్న సంబంధాలపై ఆరాతీసినట్టు సమాచారం. ఈవెంట్ మేనేజర్గానే కెల్విన్ తనకు పరిచయమని పూరీ జగన్నాథ్ చెప్పారని సమాచారం.
మీడియాతో మాట్లాడకుండానే పూరీ జగన్నాథ్ వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన మాట్లాడకుండానే వెళ్ళిపోయారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ మాదకద్రవ్యాలను తీసుకొన్నారా లేదా అనే విషయాన్ని రూఢీ చేసుకొనేందకుగాను ఆయన రక్తనమూనాలను సేకరించారు. సిట్ కార్యాలయానికి వచ్చిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పూరీ జగన్నాథ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపినట్టు సమాచారం.
పూరీ జగన్నాధ్ను అరెస్టు చేయలేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.కెల్విన్తో సంబంధాలపైనే ఎక్సైజ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. రాత్రి పూట తొమ్మిదిన్నర గంటలకు పూరీ జగన్నాద్ సిట్ కార్యాలయం నుండి బయటకు వచ్చారు.
డ్రగ్ కేసులో సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్ కీలక అంశాలను వెల్లడించారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుదవారం నాడు జరిగిన విచారణపై ప్రెస్నోట్ విడుదల చేశారు.
పూరీ అనుమతితోనే ఆయన రక్తనమూనాలను సేకరించినట్టు ఆయన ప్రకటించారు. పూరీ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ సాగిస్తామన్నారు. డ్రగ్ కేసులో మూడు ప్రముఖ కొరియర్ సంస్థలకు కూడ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.
అయితే పూరీ జగన్నాధ్ ఇచ్చిన రక్తనమూనాల నివేదిక వచ్చిన తర్వాత ఈ విషయమై మాట్లాడనున్నట్టు అధికారులు చెబుతున్నారు.