మీ రైడ్ సుఖమయం: తెలుసుకోండి హైదరాబాదీ 'డాక్టర్ ఆఫ్ రోడ్'
హైదరాబాద్: పెన్షన్ డబ్బులతో నగరంలోని రహదారులపై ఏర్పడిన గుంతలు, గతుకులను పూడ్చటమే ధ్యేయంగా పెట్టుకున్న ఓ మహానుభావుడు ఆయన. 'డాక్టర్ ఆఫ్ రోడ్'గా పేరుగాంచిన గంగాధర్ తిలక్ కట్నం గురించి వన్ ఇండియా పాఠకులకు తెలియజేప్పేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఆయన చేసిన సామాజిక సేవలు గురించి మీడియా, వార్తా పత్రికల్లో రావడంతో ప్రతి ఒక్కరూ అభినందించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గంగాధర్ తిలక్ కట్నంతో వన్ఇండియా సుమారు 30 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని యర్నగూడెంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 10వ తరగతి వరకు సొంత ఊళ్లో చదువుకున్న గంగాధర్ ఆ తర్వాత పై చదువుల కోసం ఏలూరుకు వెళ్లారు. SMVM పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిన గంగాధర్ ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం సంపాదించారు.
కొన్ని సంవత్సరాల పాటు ఇండియన్ రైల్వేస్లో పని చేసిన ఆయన అసిస్టెంట్ సిగ్నిల్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తర్వాత గంగాధర్ తిలక్ ఇన్పోటెక్ ఎంటర్ ప్రైజెస్ అనే ఐటీ ఆధారిత సంస్ధలో డిజైన్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా చేరారు.
ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చే తన పెన్షన్ డబ్బుని తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించకుండా నగరంలోని రోడ్లపై పడిన గుంతలు, గతుకులను పూడ్చడానికి ఉపయోగించారు.
రోడ్లపై గుంతలు, గతుకులను ఎప్పుడు, ఎలా పూడ్చారు?
వర్షం పడుతున్న రోజు హైదరాబాద్ నగరంలో స్కూలు విద్యార్ధులు అటుగా వెళుతుంటే, వేగంతో వస్తున్న కారు వల్ల బురద నీరు స్కూలు విద్యార్ధుల డ్రస్సుపై పడినప్పుడని బదులిచ్చారు. ఆ మరుసటి రోజు అదే రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టడంతో ఒక నిండు ప్రాణం బలైంది.
ఆ రోడ్డు ప్రమాదాన్ని కళ్లారా చూసిన నేను ప్రమాదం జరగడానికి గల కారణం మాత్రం రోడ్డుపై ఉన్న గుంతవల్లేనని గ్రహించాను. ఆ మరుసటి రోజున ఆ రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చటం నాకెంతో సంతోషానిచ్చింది.
ఆరోజు నుంచి నగరంలో ఎక్కడైనా రోడ్లపై గుంతలు కనిపిస్తే వాటిని పూడ్చేస్తుంటాను. మొదట్లో కేవలం వారాంతాల్లో మాత్రమే ఈ పనిని చేసేవాడినని చెప్పిన ఆయన, ఇన్పోటెక్లో చేరిన తర్వాత ఇదే పనిని పుల్ టైమ్గా చేసేవారని చెప్పారు.
గత ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో వేల కొద్ది గుంతలను పూడ్చినట్లు అయన తెలిపారు. రూ. 5000లతో ముడి పదార్థాలు కొనుగోలు చేసి, రోడ్లను శుభ్రం చేసే పనిని మొదలు పెట్టానని చెప్పారు.
రోడ్లపై గుంతలు పూడ్చడం వెనుక మీ ఉద్దేశ్యం?
రోడ్లపై గుంతలు పూడ్చడం వెనుక మీ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించగా ముందు రోడ్లపై ఉన్న గుంతులను పూడ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్మించడం ఆలోచిస్తే మంచిదని చెప్పారు. శుభ్రమైన రోడ్లు చాలా వరకు ప్రమాదాలను అరికడతాయని, ఎంతో మంది జీవితాలను నిలబెడతాయన్నారు.
ప్రభుత్వం రూ. 100 - 1000 కోట్ల వరకు ఆసుపత్రులను నిర్మించేందుకు ఖర్చు పెడతుందని, ముందు సరైన రహదారులను నిర్మిస్తే వాటి అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు.
కుటుంబ సభ్యులు ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు
తాను చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమానికి తమ కుటుంబ సభ్యులు ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదని అన్నారు. 'నేను ఉద్యోగం చేస్తున్న సందర్భంలో కూడా నా భార్య ఎప్పుడూ నా జీతాన్ని అడగలేదని, నా పెన్షన్తో తానేం చేసుకుంది ' అని అన్నారు.
నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ వాడి మద్దతు ఉంటుందని చెప్పారు. దేశంలోని అవినీతిపై రాజకీయ నాయకులతో మాట్లాడాల్సి ఉందని చివరగా చెప్పారు.