వివాహేతర సంబంధం: కొడుకును చంపేందుకు ప్రియురాలి సాయం తీసుకున్నాడు
ప్రియుడిని , అతడి ఆస్తిని దక్కించుకునేందుకు ఐదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్న ఓ కసాయి మహిళను, అమెను సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్: ప్రియుడిని , అతడి ఆస్తిని దక్కించుకునేందుకు ఐదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్న ఓ కసాయి మహిళను, అమెను సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో రోజు రోజుకూ దిగజారుతున్న విలువలకు ఈ సంఘటన అద్దం పడుతోంది.
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు పోలీస్స్టేషన్లో సోమవారం పరకాల ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... 2006లో దామెర మండలం పులుకుర్తికి చెందిన లక్క నాగరాజుతో పరకాల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంగల స్రవంతి వివాహం జరిగింది. వారికి తరుణ్(5) జన్మించాడు. మూడేళ్ల క్రితం నాగరాజు తన గ్రామానికే చెందిన రమ్య అనే యువతితో వివాహేతర సబంధం పెట్టుకున్నాడు.
అప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అతడి తండ్రి రాజయ్య, తల్లి పుష్ప, అక్క సుమలత స్రవంతిని వేధింపులకు గురిచేసేవారు. కొడుకును తమ వద్దే ఉంచుకొని ఇంటినుంచి వెళ్లగ్టొట్టారు. దీంతో స్రవంతి తల్లిదండ్రులు కులపెద్దలను ఆశ్రయించగా పంచాయితీ చేసి ఆస్తిని స్రవంతి, ఆమె కుమారుడు తరుణ్ పేరు మీద రాశారు. నాగరాజు తన భార్యతో కలిసి ఉండాలని తీర్మానించారు.
అయితే నాగరాజు మాత్రం భార్యను దగ్గరికి తీయలేదు. ఈ క్రమంలో తరుణ్ను హతమారిస్తే నాగరాజు ఆస్తి తన సొంతమవుతుందని ప్రియురాలు రమ్య పథకం వేసింది. ఇందుకు సహకరించేందుకు నాగరాజు, అతడి తండ్రి రాజయ్య తల్లి పుష్ప, సోదరి సుమలత ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 15న అంగన్వాడీ పాఠశాలలో చదువుకుంటున్న తరుణ్ని రమ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అన్నంలో విషగుళికలు కలిపి తినిపించింది.
కాసేటికే తరుణ్కు తీవ్రంగా కడుపునొప్పి రావడతో కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు రావడంతో రమ్య ఏమీ తెలియనట్లు నటించింది. స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తరుణ్ అమ్మమ్మ వెంగళ మణెమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసునమోదు చేశారు.
విషప్రయోగం వల్ల బాలుడు మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో ఎస్పై రవీందర్ కేసును ఛేదించారు. రమ్యతో పాటు తరుణ్ తండ్రి నాగరాజును, రాజయ్య, పుష్ప, సుమలతను అరెస్టు చేశారు. కాగా, నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్, ఎస్సై రవీందర్ను ఏసీపీ సుధీంద్ర అభినందించారు.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని వాణినగర్కు చెందిన ఓ వివాహిత మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జగిత్యాల పోలీసులు తెలిపారు. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ముమ్మాడి వీరాచారి తన కూతురు స్వప్నను సారంగాపూర్ మండలం రంగంపేటకు చెందిన కంచర్ల రాజశేఖర్కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు.
పెళ్లి సమయంలో ఒప్పుకున్న ప్రకారం రూ. 4 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. అయితే రాజశేఖర్ ఉద్యోగం వెతుక్కునేందుకు జగిత్యాలకు వచ్చి వాణీనగర్లో భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఏడాదికాలంగా ఉద్యోగం లేకపోగా ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో అదనంగా కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
మంగళవారం స్వప్నతో గొడవపడ్డ రాజశేఖర్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన భర్తకు ఫోన్చేసి ఇంటికి రావాలని స్వప్న కోరగా ఐ హేట్ యు అంటూ మెసేజ్ పంపడంతో జీవితం మీద విరక్తి చెందిన స్వప్న ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా సిఐ ప్రకాష్, ఎస్ఐ రాజయ్య చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
విషయాన్ని జిల్లా ఎప్పి అనంత శర్మ దృష్టికి తీసుకెళ్లగా ఎస్పి అక్కడికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోగా స్థానిక తహసీల్దార్ మధుసూదన్ పంచనామా నిర్వహించారు.
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు
వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు నిందితులను వరంగల్ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14.50 లక్షల విలువ గల 425 గ్రాముల బంగారం, 1200 గ్రాముల వెండి, 4 ల్యాప్య్టాప్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం మట్టెవాడ సీసీఎస్లో నిందితులను అరెస్టుచేసినట్లు సీఐ డేవిడ్రాజు ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన శీలం సందీప్, భీమారంకు చెందిన నంది వంశీ, హన్మకొండ కొత్తూర్ జెండా ప్రాంతానికి చెందిన బాలబోయిన సాయికృష్ణలు దొంగతనాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో సాయికృష్ణ హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, మరో ఇద్దరు వంశీ, సందీప్లు హైదరాబాద్లోనే బీటెక్ చదువుతున్నారు.
వంశీ, సందీప్లు మంచి స్నేహితులు కాగా మరో వ్యక్తి సాయికృష్ణ సందీప్కు బంధువు కావడంతో వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేసేందుకు పూనుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదిస్తూ విలాసంగా గడపాలని కూడబలుక్కున్నారు. పగటి వేళ తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుండేవారు.
ఈ క్రమంలో పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 చోట్ల ఇండ్లలో దొంగతనాలు చేశారు. కేయూ, సుబేదారి పోలీస్స్టేషన్ల పరిధిలో 3, మిల్స్కాలనీ పరిధిలో 2, హన్మకొండ, ఇంతేజార్గంజ్ పీఎస్, జనగామ, జిల్లాలో ఒకి చొప్పున చోరీలకు పాల్పడ్డారు. నిందితులు దొంగిలించిన సొత్తును అమ్మేందుకు గాను మంగళవారం వరంగల్ బులియన్ మార్క్ట్కు రావడంతో సీసీఎస్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు పేర్కొన్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన తప్పులను ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు చొరవ చూపిన వారిలో ఎస్ సుబ్రహ్మణ్వేరరావు, ఎఎస్ఐ సంజీవరెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్రాజు, కానిస్టేబుళ్లు జంపయ్య, మున్నా ఉన్నారు.