యువతుల ఎర: రూ. 40 లక్షలు వసూలు, ఫేక్ మీడియా ముఠా అరెస్ట్
వరంగల్: మీడియా ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత వర్గాలకు యువతులను ఎరవేసి ఈ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది.
టీవీ ఛానెళ్ల పేరిట ఈ ముఠా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఇద్దరు యువతులతో సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విశ్రాంత ఆచార్యులు, ఎఫ్సిఐ, ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఈ ముఠా రు.40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది ఓ ముఠాగా ఏర్పడి మీడియా పేరుతో విద్యా, వ్యాపార, తదితర సంస్థల యజమాన్యాన్ని బెదిరించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నకిలీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
మీడియా పేరుతో వీరు రూ. 40 లక్షల మేర వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.