వణికిస్తున్న చలి: తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా చలితీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా చలి వణికిస్తోంది. బయటకు వెళ్లాలంటేనే హడలెత్తిస్తోంది. ఉదయం 10 గంటలైనా చలిమాత్రం తగ్గడం లేదు. కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో చలి పంజా విసురుతోంది.

తెలంగాణలో సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయాయి. సిర్పూర్ -యూలో 4 డిగ్రీలకు పడిపోయింది. ఇక వాంకిడిలో 5 డిగ్రీలు, మాంగృడ్లో 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హత్నూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీలకు చేరాయి. లోకారిలో 5.6 డిగ్రీలు, జైనథ్లో 4.9, బేలలో 3.8, ఆర్లిటిలో 3.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.

వణికిపోతున్న పల్లె, పట్టణ జనం
సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఉదయం 8,9 గంటల తర్వాతే ప్రజలు బయటకు వస్తున్నారు. రాత్రి కూడా 8,9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఏజెన్సీలో వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది.
తెల్లవారుజామున విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీని మొత్తం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ చలి తీవ్రంగా ఉంది.
Recommended Video

చలిలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
కరీంనగర్ జిల్లాల్లో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా.. 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. డిసెంబర్ 14న కరీంనగర్లో 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.... నాలుగు రోజులుగా ఇది 11 డిగ్రీలకు పడిపోయింది. సోమవారం ఇది మరింత పడిపోయి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బలంగా వీస్తున్న శీతల గాలులతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.
కాగా, చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్తే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications