వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్లు.. ముగ్గురు మహిళల మృతితో ఆందోళన, దర్యాప్తుకు ఆదేశం!!
రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 24వ తేదీన 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లు చేసిన తరువాత వరుసగా మహిళలు మృత్యువాత పడుతున్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న ముగ్గురు మహిళలు మృతి
ఈనెల 28వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళ చనిపోయింది ఆ తర్వాత ఈ నెల 29వ తేదీన మరో మహిళ , నేడు మరో మహిళ మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తయిన తర్వాత మాడుగుల మండలం నర్సాయి పల్లి కి చెందిన మమత, రాజీవ్ నగర్ తండా కు చెందిన మౌనిక, మంచాల మండలం లింగంపల్లి కి చెందిన సుష్మా, ఇబ్రహీంపట్నం మండలం సీతారాం పల్లి కి చెందిన లావణ్యలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
ఆపరేషన్ తర్వాత వాంతులు, విరోచనాలతో మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన
వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ఒక్కసారిగా రక్తపోటు పడిపోయింది. దీంతో 28వ తేదీన ఒకరు, 29వ తేదీన ఒకరు, నేడు మరొకరు మృతి చెందారు. ఇంకొక మహిళ వెంటిలేటర్ మీద చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ముగ్గురు మహిళలు మృతి చెందిన సంఘటనతో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా
సుష్మ మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక మృతుల కుటుంబ సభ్యుల ఆందోళనలతో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు.
దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం.. అనాధలైన పసిబిడ్డలు
ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విచారణాధికారి గా నియమించి వారం రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడానికి గల కారణమేంటి? ఆసుపత్రిలో అన్ని మౌలిక విషయాలు ఉన్నాయా? ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్య అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉందా? వంటి అనేక అంశాల పైన ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఏది ఏమైనా మూడు రోజుల్లో ముగ్గురు తల్లులు మృత్యువాత పడగా,తల్లులను కోల్పోయిన బిడ్డలు అనాథలుగా మారారు.