రెండు ఆస్పత్రులకు వెళ్లి ఏడేళ్ల పబ్లిసిటీ, చెప్పింది చేయని సీఎం కేసీఆరే: బండి సంజయ్, విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురుపోసుకుంటున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి ఐదు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రైతు గోస-బీజేపీ పోరు దీక్షను చేపట్టింది.

చెప్పించి చేయని ఏకైక సీఎం కేసీఆరే: బండి సంజయ్
పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. చెప్పింది చేయని ఏకైక సీఎం కేసీఆరేనని విమర్శించారు. కేసీఆర్ తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పంటలను కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తాలు, తరుగు, హమాలీల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత సీఎంపై లేదా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్రంలో సరిగా జరగడం లేదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రెండు ఆస్పత్రులు సందర్శించి ఏడేళ్ల పబ్లిసిటీ..
తెలంగాణ రైతులు ఏడుస్తున్నా.. ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు ఎక్కడికి పోయింది? రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు. ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారని.. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ఆస్పత్రుల పర్యటన అని అన్నారు. కుంభకర్ణ నిద్ర వీడిన కేసీఆర్.. రెండు ఆస్పత్రులు సందర్శించి.. ఏడేళ్ల పబ్లిసిటీ పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Recommended Video

కేసీఆర్ను ప్రజలు నమ్మట్లేదన్న విజయశాంతి
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఆ పార్టీ నేత విజయశాంతి తన నివాసంలోనే సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వరంగల్కు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు కొత్త హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు. 'కేసీఆర్ను ప్రజలెవరూ నమ్మేటట్లు లేరు. మామూలు టైమ్లో వరంగల్ వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసే కరోనా సమయంలో వెళ్లొచ్చారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. తద్వారా రైతులను ఆదుకోవాలి. ఈ లాక్డౌన్ సమయంలో రైతులకు రవాణా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. రైతులకు రుణమాఫీ, రైతు బంధు, నష్ట పరిహారం ఇవ్వాలి' అని విజయశాంతి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications