కొన్ని పేపర్ల తప్పుడు రాతలు, సిట్టింగ్లకు టిక్కెట్లు: కేసీఆర్, మీకేంపని అని కేంద్రానికి ప్రశ్న!
హైదరాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ డైమండ్ అని, ఒకరో ఇద్దరో సరిగా లేకున్నప్పటికీ వారిని మార్చుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Recommended Video
నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్
టీఆర్ఎస్లో 30 శాతం మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నానని, మా ఎమ్మెల్యేలు బాగున్నారని, సిట్టింగులకు టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. కొన్ని పేపర్లు తప్పుడు రాతలు రాస్తున్నాయని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో గెలిచి రాని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామన్నారు.
ఎవరూ భయపడొద్దు
విభజన నేపథ్యంలో ఆంధ్రా వాళ్ల ఆస్తులు లాగేసుకుంటారని ప్రచారం చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేస్తారని కూడా చెప్పారన్నారు. కానీ, గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉందని చెబుతున్నారన్నారు. హైదరాబాదులో ఉన్నవాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణలో ఎవరు బాగుపడ్డా మాకు సంతోషం
అభివృద్ధి విషయంలో తాము ఎలాంటి పక్షపాతం చూపించడం లేదని కేసీఆర్ చెప్పారు. కొందరు వ్యతిరేక వార్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జానారెడ్డి అయినా, కేసీఆర్ అయినా నియోజకవర్గానికి ఇచ్చే నిధుల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. విపక్ష ఎమ్మెల్యేలపై ఎప్పుడూ వివక్ష చూపలేదన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఏ ప్రాంతం అభివృద్ధి జరిగినా, ఎవరు బాగుపడ్డా అది మన మాకు సంతోషమే అన్నారు.
వీటితో మీకేం పని?
అంతకుముందు, ఆయన జాతీయ పార్టీలపై మండిపడ్డారు. తస్మాత్ జాగ్రత్త.. మీ పని అయిపోయిందని బీజేపీ, కాంగ్రెస్లను ఉద్దేశించి అన్నారు. కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ, విద్యా, అర్బన్, రూరల్ డెవలప్మెంట్తో వారికి ఏం పని అన్నారు. ఆరోగ్యం విషయం వారికెందుకని ప్రశ్నించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం వారికి ఏమి అవసరమన్నారు.
నేనే రంగంలోకి దూకా.. నాకు ఓపిక ఉంది
దేశం గురించి కాంగ్రెస్, బీజేపీలో మాట్లాడాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. చేయి గుర్తుపై కోపం వస్తే కమలంకు, కమలంపై కోపం వస్తే చేయి గుర్తుపై ఓటు వేయడమేనా అన్నారు. ఈ పార్టీల హయాంలో డేరా బాబా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు బయటకు వస్తున్నారని మండిపడ్డారు. ఇక నేనే రంగంలోకి దూకానని చెప్పారు. కేసీఆర్ ఫ్రంట్ అని కొందరు అంటున్నారని, కానీ తమది కేసీఆర్ ప్రారంభించిన ఫ్రంట్ అన్నారు. తనకు వ్యూహం ఉందని, ఓపిక ఉందని, చతురత ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు. ఇప్పుడున్న మోడీ పోయి కాంగ్రెస్ వస్తే ఏం ఒరుగుతుందన్నారు.
తొలుత కేసీఆర్ అసంతృప్తి
అంతకుముందు, ప్లీనరీలో ఏర్పాట్లపై కేసీఆర్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో వక్తలు మాట్లాడింది ఎవరికీ వినపడని పరిస్థితి నెలకొందని, ఏర్పాట్లు పర్యవేక్షించిన రాజేశ్వర్ రెడ్డిని పిలిచి చెప్పారు. సభా వేదికపైకి వచ్చిన కేసీఆర్కు ఎవరు ఏం మాట్లాడుతున్నారన్నది వినపడక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. 'రాజేశ్వర్ రెడ్డిగారూ... ఇప్పుడు సారయ్య మాట్లాడింది ఎవరికైనా అర్థమైందా? ఆ ఏం లొల్లయ్యా నాకు అర్థం కాదు... బంద్ చేయవయ్యా బాబూ... ఆ సౌండ్ వాళ్లు ఎవళ్లయ్యా బాబూ... సౌండ్ వాళ్లులేరా? బాలమల్లయ్యా... ఆ ఏసీలు బంద్ చేయించయ్యా బాబూ... ఏం సభ పెట్టారా లేక తమాషా సర్కస్ పెట్టారా? బంద్ చేయించమన్నాకు కదా? గంట పడుతుందా దానికి? అని వ్యాఖ్యానించారు. సభా ప్రాంగణంలో హైస్పీడ్ కూలర్లను ఏర్పాటు చేయడంతో వాటి గాలికి ఎవరు ఏం మాట్లాడుతున్నారన్న విషయం తొలుత వినపడలేదు. దీంతో కేసీఆర్ పైవిధంగా స్పందించారు. అది పక్కన పెడితే ప్లీనరీ అద్భుతంగా సాగింది. ఆ తర్వాత ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ విజయవంతమైనందుకు అందర్నీ అభినందించారు.