టీకాలపై కూడా రాజకీయమా..కొవాగ్జిన్ పై దుష్ప్రచారం: భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల భావోద్వేగం
హైదరాబాద్ : భారత్ బయోటెక్ నుంచి వస్తున్న కొవాగ్జిన్ టీకాకు ఆదివారం డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు నిపుణులు అనుమతి ఇచ్చిన విధానాన్ని తప్పుబట్టారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉండగానే ఎలా అనుమతి ఇస్తారంటూ కొందరు శాస్త్రవేత్తలు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల వర్చువల్ ప్రెస్ మీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. తమ సంస్థకు భారత్లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా భాగస్వాములు ఉన్నారని కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్ల విషయంలో భారత్ బయోటెక్కు గ్లోబల్ పార్ట్నర్స్ ఉన్నారని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు.
Recommended Video
అత్యుత్తమ సంస్థల నుంచి పారదర్శకమైన నివేదిక
ఇక వ్యాక్సిన్ గురించి మాట్లాడిన కృష్ణ ఎల్ల... ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు తమ టీకాకు పారదర్శకమైన నివేదిక ఇచ్చాయని గుర్తుచేశారు. ఈ విజయం శాస్త్రవేత్తలకు వాలంటీర్లకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్తో సహా 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పారు. యూకేలో తాజాగా బయటపడిన స్ట్రెయిన్కు కూడా కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని కృష్ణ ఎల్ల చెప్పారు. తమ సంస్థ నుంచి వస్తున్న కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పారు. చాలామంది తమ పారదర్శకతను ప్రశ్నిస్తున్నారని... ముందుగా దేశీయ ఫార్ములాతో ఈ టీకాను తయారు చేస్తున్నందునే వారు అలా మాట్లాడుతున్నారని కృష్ణ ఎల్ల మండిపడ్డారు. భారత్ బయోటెక్ తమ వ్యాక్సిన్పై 5 పబ్లికేషన్లు ఇచ్చిందనే విషయాన్ని సీఎండీ గుర్తుచేశారు.
దేశీ కంపెనీలే పనిగట్టుకుని దుష్ప్రచారం
చికున్ గున్యాతో సహా పలు వ్యాధులకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్లను తీసుకొచ్చి విజయం సాధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు కృష్ణ ఎల్ల. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ జర్నల్స్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పై వ్యాసాలు వచ్చాయని వెల్లడించారు. తమ కంపెనీ కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని చాలా దేశాల్లో తమకు భాగస్వాములు ఉన్నారని గుర్తు చేశారు. తమ ప్రయోగ పద్ధతులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కొన్ని దేశీయ కంపెనీలు భారత్ బయోటెక్పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణ ఎల్ల. అంతేకాదు ప్రపంచ స్థాయి జర్నల్స్ దాదాపు 70 వ్యాసాలు ప్రచురించాయని చెప్పారు.
విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని భారత్ బయోటెక్
గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలకు ఆమోదం లభించిందని... భారత్ బయోటెక్ ఏ విదేశీ సంస్థకు తీసిపోదని అన్నారు కృష్ణ ఎల్ల. ప్రస్తుతం 20 మిలియన్ డోసులను తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. జూలై ఆగష్టు నెలకల్లా 150 మిలియన్ డోసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫైజర్ లాంటి విదేశీ సంస్థతో సమానంగా పబ్లికేషన్స్ ఇచ్చినట్లు చెప్పిన కృష్ణ ఎల్ల... తాము 25 వేల మందిపై ప్రయోగం నిర్వహించినట్లు చెప్పారు. తమ డేటాలో పారదర్శకత లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు కృష్ణ. వదంతుల ద్వారా భారతీయ కంపెనీలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.