వివక్ష: హైదరాబాద్లో కొట్టుకున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ కళాశాలలో రెండు రాష్ట్రాల విద్యార్థులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. ప్రిన్సిపల్, వార్డెన్ వేధిస్తున్నారని ఓ రాష్ట్రం విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు పదిహేను మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాదులోని హయత్ నగర్ నోవా కళాశాలలో ప్రిన్సిపల్ బీహార్కు చెందిన వారు. ఈ కళాశాలలో బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారు చదువుతున్నారు.
కళాశాలలో బీహార్కు చెందిన ప్రిన్సిపల్ ఉండటంతో తమను చాలా కాలంగా వేధిస్తున్నారని తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీహార్ వారి పట్ల ఓ రకంగా, తెలంగాణ వారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇరువర్గాల మధ్య తరుచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. గురువారం నాడు వచ్చిన మార్కుల్లో బీహార్ విద్యార్థుల కంటే తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో... వారు నిలదీశారు. దీని విషయమై వాగ్వాదం జరిగింది. అనంతరం పరస్పరం దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడ్డారని తెలుస్తోంది.
కాంగ్రెస్ ధర్నా
కరీంనగర్ జిల్లా రామగుండం కార్పోరేషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు గురువారం ధర్నాకు దిగారు. కాంగ్రెస్ వార్డుల్లో అభివృద్ధిని టిఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. టిఆర్ఎస్ తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.