ఎర్రసూర్యుడు మాదాల రంగారావు కన్నుమూత
హైదరాబాద్: కొద్ది రోజులుగా హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్ర సూర్యుడు మాదాల రంగారావు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవలి వరకు వెంటిలెటర్ పైన ఉన్నారు.
విప్లవ భావాలున్న చిత్రాల్లో నటించి, తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించారు. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని తన సినిమాల్లో చూపించారు. చైర్మన్ చలమయ్య చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, ఎర్రసూర్యుడు, బలిపీఠంపై భారతనారి, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి వంటి చిత్రాల్లో నటించి రెడ్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు.
ఆయన నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి యువతరం కదిలింది చిత్రాన్ని తీసి, బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. మాదాల మృతిపై టాలీవుడ్ పెద్దలు సంతాపాన్ని తెలియజేశారు.
ఆయనది ప్రకాశం జిల్లా మైనంపాడు మాదాల గ్రామం. 1948 మే 25వ తేదీన జన్మించారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు.